వైసీపీ నిప్పులు: చంద్రబాబు రెండేళ్ల పాలనంతా అవినీతి, అరాచకమేనా?
అమరావతి: ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించినందుకు గాను చంద్రబాబుపై వైసీపీ నేతలు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
పదవిలోకి వచ్చేందుకు అమలు కాని హామీలను ఇచ్చి పదవిలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని ముఖ్యమంత్రి చంద్రబాబును రెండేళ్ల పాలనపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడి రెండేళ్ల పాలనపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బుధవారం బొత్స మీడియాతో మాట్లాడుతూ 'రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు' అని ఆయన విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 'చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన విషయం వాస్తవమా.. కాదా..?' అని నిలదీశారు. 'నిరుద్యోగ భృతి ఇస్తామన్న విషయం వాస్తవమా.. కాదా..?' అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. పోలవరం పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని, అసలు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తారా లేదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదా లేక మీదా? అని ప్రశ్నించారు. 'రైతులకు వడ్డీ భారం అయిందా.. లేదా..?' అని బాబు రెండేళ్ల పాలనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏపీకి ప్రత్యేకహోదా సాధనపై సాకులు చెబుతూ ప్రజలను సైతం మభ్య పెడుతున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన అంతా అవినీతి, అరాచకమని బొత్స ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని నెరవేర్చలేదని... ఈ రెండేళ్లలో ఏ ప్రాంతానికీ, ఏ వర్గానికీ న్యాయం జరగలేదని విమర్శించారు.
పులివెందులలో చర్చకు సిద్ధమా?: ఎంపీ అవినాష్ రెడ్డి
ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డికి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వాల్ విసిరారు. చంద్రబాబు హామీలపై వైయస్ జగన్తో చర్చించే స్థాయి సతీష్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి దమ్ముంటే తనతో పులివెందులలో చర్చకు సిద్ధమా? సవాల్ చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. అంతక ముందు సీఎం చంద్రబాబుపై పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జూన్ 8వ తేదీన చంద్రబాబు మోసాలపై ఏపీలోని అన్ని జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదు చేయాలని వైసీపీ అధినేత వైయస్ జగన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలు చేపట్టారు.
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఆళ్లనాని
ఏపీ సీఎం చంద్రబాబుపై పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని నిప్పులు చెరిగారు. బుధవారం గోపాలపురం పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాని ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబును ప్రజలు నిలదీసే రోజులు ప్రారంభమయ్యాయని అన్నారు.
ఇచ్చిన హామీలను మరిచిన బాబును ప్రజలు తరిమికొడతారని, రెండేళ్ల పాలనలో రూ. కోట్లలో అవినీతి తప్పా, రాష్ట్రానికి ఆయన ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో పశ్చిమగోదావరి జిల్లాను బాబు నిలువునా మోసం చేశారని నాని ఆరోపించారు.