176 ఏళ్ల నాటి బత్తిని చేప ప్రసాదం.. రేపు రాత్రి నుంచే పంపిణీ
ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు ఏటా పంపిణీ చేసే ప్రసిద్ధ 'బత్తిని చేప ప్రసాదం' పంపిణీకి హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీ (సోమవారం) రాత్రి 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో (నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్) ఈ పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన భారీకేడ్లు , క్యూలైన్లను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సాధారణంగా మృగశిర కార్తె ఉదయం పూట ప్రవేశించేదని, కానీ ఈసారి రాత్రి 9 గంటలకు కార్తె సమయం కుదిరిందని స్పష్టం చేశారు. దీంతో 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమై, 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా ఈ చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందన్నారు. రాత్రి వేళలో పంపిణీ జరుగుతుండటంతో క్యూలైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. దొంగతనాలు, పిక్ పాకెటింగ్ జరగకుండా షీ టీమ్స్ రంగంలోకి దించుతున్నామని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

ఉక్కపోతకు చెక్.. క్యూలైన్లలో కూలర్లు, ఫ్యాన్లు
ప్రస్తుతం వేసవి ఉక్కపోత తీవ్రంగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. క్యూలైన్లు ఉండే అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని, తాగునీటి ఎద్దడి రాకుండా జలమండలి సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా వచ్చే భక్తులకు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ఆహారాన్ని, అల్పాహారాన్ని అందించాలని మంత్రి కోరారు. మైకుల ద్వారా స్పష్టమైన సమాచారాన్ని భక్తులకు చేరవేయడానికి ఆడియో వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు.
వైద్య సేవలు రెడీ.. ప్రత్యేక సీపీఆర్ బృందాలు
చేప ప్రసాదం కోసం వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులు, ఫైర్ ఇంజన్ వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా క్యూలైన్ల మధ్యలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా 'సీపీఆర్' (CPR) ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి, అన్ని విభాగాల అధికారులు వాట్సప్ గ్రూప్ ద్వారా క్షణక్షణానికి సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షించాలని మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
176 ఏళ్ల నమ్మకం.. 1.4 లక్షల చేప పిల్లలు సిద్ధం!
మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. దాదాపు 176 సంవత్సరాలుగా బత్తిని కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఉచితంగా ఈ చేప ప్రసాదాన్ని ప్రజలకు అందిస్తోందని కొనియాడారు. ఈ సుదీర్ఘ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, ఈసారి మత్స్యశాఖ ద్వారా దాదాపు 1.4 లక్షల చేప పిల్లలను (ముర్రల్ ఫిష్) భక్తుల కోసం అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులు ప్రశాంతంగా వచ్చి చేప ప్రసాదాన్ని స్వీకరించవచ్చని మంత్రులు భరోసా ఇచ్చారు.














Click it and Unblock the Notifications