జగన్ హోటల్లో అంటూ ఏదో అంటే, వీరు ప్రచారమా: బొత్స ఫైర్
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హోటల్లో ఎవరిని కలిశారో తెలుసునని తెలుగుదేశం పార్టీ నాయకులు అనడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తగా ఓ డ్రామా ప్రారంభించారని, బంజారాహిల్స్లోని ఓ హోటల్లో జగన్ ఎవరినో కలిశారంటూ కొత్త వాదన ముందుకు తెచ్చారని, ఇది దురదృష్టకరమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
నిజంగానే సాక్ష్యాలుంటే హోటల్ భేటీపై ఏం జరిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అదేమీ లేకుండా ఎక్కడ ఎవరో ఏదో చెప్తే దాన్ని వీళ్లు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారని, ఇది సరైంది కాదని ఆయన అన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోయినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఓట్లను కోట్లతో ఎలా కొనుగోలు చేసిందో, ఎపిలో కూడా అలాగే చేస్తోందని ఆయన ఆరోపించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. నెల్లూరులో జరిగిన ఘటన చూస్తే చట్టాన్ని ఏ విధంగా చేతుల్లోకి తీసుకున్నారో, వాళ్లు పోలీసు వ్యవస్థను ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అర్థమవుతుందని బొత్స అన్నారు.
వ్యవస్థ దారి తప్పితే దాన్ని సక్రమంగా పెట్టడం చాలా కష్టమని, ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం ఇలాంటి నీతి మాలిన పదవులు చేయడం సరి కాదనే ఉద్దేశంతో తమ పార్టీ బలంలేని చోట పోటీకి దూరంగా ఉందని ఆయన గుర్తు చేశారు. అధికారులు నీతిమాలిన పనులు చేయడం సరి కాదని ఆయన అన్నారు. వాళ్లు తల దించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన హితవు పలికారు.
అధికారం చేతిలో ఉంది కదా అని నాయకులు చెప్పినట్లు అధికారులు వింటే ప్రజాస్వామ్యంలో ఐదోళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేసుకుని, రేపు అధికారం చేతులు మారితే అప్పుడు తల దించుకోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
అధికారులు కూడా వ్యవస్థలోనే ఉంటారని, వ్యవస్థ గాడి తప్పితే దాన్ని మళ్లీ గాడిలో పెట్టడం సాధ్యమయ్యే పని కాదని ఆయన అన్నారు. చట్టప్రకారం అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పని చేయకూడదని ఆయన అన్నారు.
సెక్షన్ 8 విషయానికి వస్తే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పార్లమెంటులో చట్టం అయినప్పుడు అందులో తప్పున్నా, ఒప్పున్నా చట్టం తుచ తప్పకుండా అమలు కావాలనే తాము ముందు నుంచీ చెబుతున్నామని ఆయన అన్నారు. అందులో సెక్షన్ 8 ఉన్నా, 9 ఉన్నా అమలు చేయాల్సిందేనని బొత్స అన్నారు. అంతే తప్ప ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు సెక్షన్ 8 అమలు చేయాలని అనడం తప్పు అని అన్నారు.
హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని నగరమని, ఏడాది పాటు అన్నింటినీ గాలికి వదిలేసి ఇప్పుడు కేసు వచ్చిందని చెప్పి ఈ సెక్షన్ గురించి మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.