ఓటుకు నోట్ల కేసుపై విచారణ చేపట్టాలి: బాబు, టీడీపీపై బొత్స నిప్పులు
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ఉండి, ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయిన చంద్రబాబు ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్టణంలో ధర్మపోరాట దీక్షను చంద్రబాబు ఎందుకు చేశారో అర్థం కావట్లేదని అన్నారు. రాజకీయ లబ్ది కోసం, ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు చేస్తున్నదే ఈ ధర్మపోరాట దీక్ష అని విమర్శించారు. బీజేపీతో వైసీపీకి సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ సభ్యురాలి పదవిని ఇచ్చారని విమర్శించారు. ప్రజలు అమాయకులని చంద్రబాబు అనుకుంటున్నారని, ధర్మం పేరిట ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే కాలంలో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
తన పిలుపు మేరకు కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎన్నికలకు ముందు బీజేపీకి ఓటు వేయవద్దని ధైర్యంగా తెలుగు ప్రజలకు ఎందుకు బహిరంగ విజ్ఞప్తి చేయలేదని సూటిగా ప్రశ్నించారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు చంద్రబాబు ప్రచారం చేయలేదని అడిగారు.
'ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఓట్లు కొనేందుకు గాలి జనార్థన్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. దీనిని వైఎస్సార్ సీపీ ఎందుకు ప్రశ్నించడం లేదని యనమల అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నారు. దాన్ని ఖండించినట్లే, కర్ణాటకలో ప్రలోభాలు జరిగితే దానిని కూడా వైయస్సార్ సీపీ ఖండిస్తోంది. ఈ విషయాన్ని యనమల గుర్తించాలి. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ప్రతిపక్షంపై టీడీపీ బురద జల్లుతోంది. కర్ణాటకలో డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యవహారాన్ని వైయస్సార్ సీపీ ఖండిస్తోంది. దీనిపై విచారణ జరగాలని, అలాగే చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో కూడా విచారణ జరపాలి' అని బొత్స కోరారు.
'మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కూడా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ను మంత్రిగా వుండి కూడా సాధించలేకపోయారు. రాష్ట్రంలో ధర్మం వుందా? తిరుమలలో జరుగుతున్నది ఏమిటి? అక్కడ జరిగిన అక్రమాలపై ఎందుకు దర్యాప్తు చేయలేకపోతున్నారు. సాక్షాత్తూ కనకదుర్గమ్మ దేవస్థానంలో తాంత్రిక పూజలు జరిగితే ఇప్పుటి వరకు చర్యలు లేవు. సదావర్తి భూములకే దిక్కులేని పరిస్థితి. దేవుళ్లకే రక్షణ లేని రాష్ట్రంలో ధర్మం ఎక్కడ ఉంది' అని ఘాటుగా స్పందించారు బొత్స సత్యనారాయణ.
'రాష్ట్రంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. లీటరుకు నాలుగు రూపాయలు స్పెషల్ టాక్స్గా చంద్రబాబు సర్కార్ వసూలు చేస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వమే దానిని భరించింది. ప్రజలు అమాయకులని చంద్రబాబు అనుకుంటున్నారు. ధర్మం పేరుతో ప్రజలను అన్యాయం చేస్తున్నారు. దీనికి రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు. రాష్ట్ర మంత్రులు కూడా ఇష్టారాజ్యంగా మాడ్లాడితే సహించం' అని బొత్స సత్యనారాయణ అన్నారు.
కాగా, ఎంపీల రాజీనామాలపై మే 29న రావాలని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నుంచి ఆహ్వానం వచ్చిందని, ఎంపీలు తమ రాజీనామాలకే కట్టుబడి ఉన్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. టీడీపీ ఎంపీలను కూడా కలిసి రమ్మని కోరామని, కానీ వారు రాలేదని చెప్పారు. ఇప్పటికైనా టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే బుధవారం ఉదయమే ఢిల్లీకి వెళ్లి రాజీనామాలు చేయాలని సవాల్ విసిరారు.