గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి బొత్సా సత్యన్నారాయణ సవాల్; చంద్రబాబుకు చురకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ టైం సెటిల్మెంట్ స్కీం వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపణలు గుప్పించారు.

మంత్రి బొత్సాకు సవాల్ చేసిన టీడీపీ నేత గోరంట్ల
ఓటిఎస్ కోసం ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారని ఓటిఎస్ చెల్లించకుంటే పెన్షన్, రేషన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించిన ఆయన రాష్ట్రంలో బలవంతపు వసూళ్లు చేస్తున్నారని తాను నిరూపిస్తానని, మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. అంతేకాదు ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తారా? అంటూ ఛాలెంజ్ చేశారు. తాను చెప్పింది తప్పని వైసీపీ నేతలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

జగన్ సర్కార్ పై ధ్వజం ... గోరంట్ల సవాల్ కు ప్రతిసవాల్ చేసిన బొత్సా
ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. ఓటిఎస్ విషయంలో వేధింపులు నిజమేనని తాను ఎక్కడైనా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. టిడిపి నేత బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యల పై మండిపడిన వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి సవాల్ విసిరారు. తాను అబద్దాలు ఆడుతున్నానని బుచ్చయ్య చౌదరి చెబుతున్నారని, ధైర్యముంటే చర్చకు రావాలంటూ బహిరంగ సవాల్ విసిరారు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

ఇద్దరం కలిసి రాజీనామా చేద్దాం రమ్మని బొత్సా సవాల్
ఎవరి వాదన ఏమిటో చెబుదామని.. ఇద్దరం కలిసి రాజీనామా చేద్దాం రమ్మని బొత్స సత్యనారాయణ బుచ్చయ్య చౌదరిని చాలెంజ్ చేశారు. ఇంత వయసు ఉండి అర్థం పర్ధం లేకుండా మాట్లాడితే ఎలా అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు గురువింద గింజ లాంటి వ్యక్తని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబుకు సందర్భంతో పనిలేదని మైకులు కనిపిస్తే చాలు చంద్రబాబు రెచ్చిపోతాడు అని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై బురద చల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

చంద్రబాబు రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడటం విడ్డూరం
మభ్యపెట్టడం, మోసం చేయడం చంద్రబాబుకు బాగా అలవాటని చిత్తశుద్ధితో పని చేయాలన్న తపన చంద్రబాబులో లేదని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్త అవకాశం దొరికినా కడుపులో ఉన్న ఆక్రోశం కక్కేస్తాడని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నాడు అని మండిపడిన ఆయన అప్పట్లో చంద్రబాబు రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకొని కార్యక్రమాలు చేశారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ మార్చి ఏకంగా మంత్రులు చేశాడని పేర్కొన్న బొత్స సత్యనారాయణ మరియు ఇది రాజ్యాంగ స్ఫూర్తియేనా అంటూ చంద్రబాబును నిలదీశారు.
Recommended Video

అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ఎందుకు కట్టలేదో?
తాము అంబేద్కర్ విగ్రహాన్ని కట్టలేదని చంద్రబాబు పేర్కొన్నారని, 2016లో తానే జీవో ఇచ్చినట్లుగా చంద్రబాబు చెప్పారని పేర్కొన్న బొత్స సత్యనారాయణ 2019 వరకు మరి చంద్రబాబు ఎందుకు అంబేద్కర్ విగ్రహాన్ని కట్టలేదు చెప్పాలని ప్రశ్నించారు. కాల్ మనీ ఎపిసోడ్ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి జీవో తీసుకువచ్చారని పేర్కొన్న బొత్స సత్యనారాయణ చంద్రబాబు రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకున్నారు అంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications