ప్రియుడి కోసం మరో గృహిణి ఘాతుకం...కన్న కొడుకుకు చిత్రహింసలు...
గుంటూరు: మాతృత్వ బంధానికే చెడ్డ పేరు తెచ్చే దారుణమైన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలిస్తున్నాడనే అక్కసుతో ఓ తల్లి తన కన్న కొడుకునే దారుణంగా చిత్రహింసలు పెట్టింది. గుంటూరు నగరం కోబాల్ట్ పేటకు చెందిన ఓ మహా తల్లి ఈ నీచానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే...రిజ్వానా అనే మహిళ బాలస్వామి అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు మగపిల్లలు సంతానం. అయితే భర్తతో గొడవపడి విడిపోయిన రిజ్వానాకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.
అయితే తమ వివాహేతర సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారనే కారణంతో పెద్ద కొడుకును అమ్మేసిందని ఆమె మొదటి భర్త బాలస్వామి ఆరోపణ. ఆ తర్వాత ఇంట్లోనే ఉండే రెండో కొడుకును కూడా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. ఇలా రెండు రోజుల క్రితం ఈ చిన్నారికి ఒళ్లంతా వాతలు పెట్టిన రిజ్వానా, ఇంటికి తాళం వేసి ప్రియుడితో కలిసి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో తీవ్ర గాయాలతో ఏడుస్తున్న చిన్నారిని చట్టుప్రక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న మొదటి భర్త ఆస్పత్రిలో ఉన్న తన కుమారుడి దగ్గరకు వెళ్లి అతడే దగ్గరుండి చికిత్స చేయిస్తున్నాడు. అయితే తన భార్య నుంచి తనకు కూడా ప్రాణహాని ఉందని...తనను చంపేందుకు భార్య తన ప్రియుడుతో కలిసి కుట్ర చేస్తోందని రిజ్వానా భర్త మీడియాకు వెళ్లడించాడు. తనకు, తన కుమారుడికి ప్రాణహాని జరిగితే అందుకు తన భార్యే బాధ్యురాలని, తనకు తన కుమారుడికి న్యాయం జరగాలని బాలస్వామి కోరుతున్నాడు.