తక్కువ కులమని విడదీసినందుకు.. దళిత యువతి ఆత్మహత్య
మూడు నెలల క్రితం ఇంట్లోంచి పారిపోయి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆపై పెద్ద మనుషుల పిలుపు మేరకు ఇటీవలే గ్రామానికి వచ్చారు.
గూడూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. మరో వివాహం చేసుకుంటున్నాడని తెలిసి ఓ దళిత యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కర్నూలు జిల్లా గూడూరు మండలం కె.నాగులాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కులాలు వేరుకావడంతో వీరి పెళ్లిని అబ్బాయి తరుపు తల్లిదండ్రులు అంగీకరించలేదని తెలుస్తోంది.
వివరాల్లోకి వెల్తే.. కె.నాగులపురం గ్రామానికి చెందిన గీత(17) కోడుమూరులో టీటీసీ చదువుతోంది. నాగులపురం పక్క గ్రామం పెంచికలపాడుకు చెందిన సోమశేఖర్ రెడ్డి.. కర్నూలులో డిగ్రీ చదువుతున్నాడు. కొంతకాలం క్రితం వీరిద్దరికి పరిచయం ఏర్పడగా.. అది కాస్త ప్రేమకు దారి తీసింది.
విషయం ఇరువురి ఇళ్లలో తెలిసి ఇద్దరిని వారించారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి ససేమిరా అన్నారు. దీంతో మూడు నెలల క్రితం ఇంట్లోంచి పారిపోయి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆపై పెద్ద మనుషుల పిలుపు మేరకు ఇటీవలే గ్రామానికి వచ్చారు. పంచాయితీ పెద్దల సమక్షంలో గీత తల్లిదండ్రులకు సోమశేఖర్ తల్లిదండ్రులు రూ.8లక్షల డబ్బు ముట్టజెప్పి, మైనారిటీ తీరిన తర్వాత పెళ్లి జరిపిస్తామని హామి ఇచ్చారు.
కానీ ఇచ్చిన మాట తప్పి, సోమశేఖర్ కు మరో యువతితో వివాహం నిశ్చయం చేశారు. ఈ మేరకు గురువారం పెంచికలపాడులో వివాహం కూడా జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న గీత తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.