బీజేపీని కోలుకోని దెబ్బకొట్టాలి..! అదే చంద్రబాబు లక్ష్యం..!
హైదరాబాద్: ఏపీ రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. నిన్నటి వరకు ఒకే వేదిక పంచుకున్న రెండు పార్టీల నాయకులు నేడు కత్తులు దూసుకుంటున్నారు. ఇరు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లని వేడుకున్న ఆ రెండు పార్టీలు ఇప్పుడు ఓడించాలని అదే ఓటర్లని ప్రాధేయపడే పరిస్థితులు తలెత్తాయి. 2014లో మిత్రపక్షంగా ముందుకు వెళ్లి అదికారాన్ని పంచుకున్న టీడిపీ -బీజేపి రాబోవు ఎన్నికల్లో ఒకరి ఓటమి కోసం ఒకరు వ్యూహాలు రచిస్తున్నారు. అవసరం అనుకుంటే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునైనా అటు టీడిపిని ఓడించాలని బీజేపి, ఇటు బీజేపీని ఓడించాలని టీడిపి కంకణం కట్టుకుని కార్యాచరణ రూపొందిస్తున్నాయి. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి జీవితకాల శత్రువులతో చేయి కలిపి మరీ కాషాయ పార్టీని మట్టికరిపించాలని పావులు కదుపుతున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలే తారక మంత్రం..! దాంతోనే తిప్పుతాం చక్రం.. అంటున్న బాబు.
టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్పై కొంత మెతక వైఖరిని అవలంబిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అవసరమైతే పరోక్షపొత్తుకు సంకేతాలిస్తున్నారట. జాతీయ స్థాయిలో జట్టుకట్టేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. మైత్రీపూర్వక పోటీలకు మొగ్గు చూపుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ వ్యతిరేకతే ప్రధాన అజెండాగా ఆవిర్భవించిన తెలుగుదేశంలో ఈ ధోరణి కొంత వివాదాలకు దారితీస్తోంది. అయితే బీజేపీపై వ్యతిరేకతను తెలివిగా కాంగ్రెసుపై సానుభూతిగా మార్చాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అయితే పార్టీలో ఉన్న అసమ్మతివాదులు దీనిని పార్టీపై గురి పెట్టేందుకు వినియోగించుకుంటున్నారని తెలుస్తోంది.
బీజేపి ని కొట్టాలంటే కాంగ్రెస్ ను కలుపుకోవాలి..! అందుకు నేతల మద్య ఐకమత్యం తేవాలి..!
పలు కారణాలతో తెలుగుదేశంలోని కొందరు సీనియర్ నేతలు పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహంతో ఉన్నారు. కానీ బయటపడలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అవమానాలు ఎదురైనా బయటికి వచ్చి సాధించేదేమీ ఏమీ లేదనుకుంటున్నారట. అందుకే అన్నిటికీ సహిస్తున్నారని పార్టీలోని ద్వితీయశ్రేణి పేర్కొంటోంది. కాగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చంద్రబాబు నాయుడికి సమకాలికుడు. టీడీపీ అధినేతకు వారసుడైన లోకేశ్ తన శాఖపై పెత్తనం చేయాలని చూడటాన్ని ఆయన సహించలేకపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా సర్దుబాటు చేయడమే తప్ప సమస్య శాశ్వతంగా పరిష్కారం కాలేదని తెలుస్తోంది.
తెలుగు తమ్ముళ్లు సంయమనం పాటించాలి..!బాబు కన్నా వ్యూహకర్తాలా..!
అలాగే విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు తొలినాళ్లనుంచి టీడీపీని నమ్ముకుని ఉన్నవ్యక్తి. ఆ జిల్లాలో అయిదేళ్లకో పార్టీ మార్చే గంటా శ్రీనివాసరావుకు పెత్తనం అప్పగిస్తున్నారని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారని సమాచారం. వీరంతా తమ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ‘కాంగ్రెసుతో చెలిమి' అంశాన్ని ఒక అస్త్రంగా మార్చుకున్నారట. కాంగ్రెసుతో వెళితే పార్టీకి పుట్టగతులుండవన్నంత రీతిలో వీరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరోవైపు గడచిన రెండు మూడు నెలలుగా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుకు సంబంధించి సాఫ్ట్ కార్నర్ ను క్యాడర్ కు చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను చల్లార్చాలి..! బీజేపీ పైన ప్రతీకార జ్వాల రగల్చాలి..!
పొలిట్ బ్యూరో, విస్తృత స్తాయి సమావేశాల్లో ఒకటికి రెండు మార్లు కాంగ్రెసు కంటే బీజేపీనే ప్రథాన శత్రువన్న ప్రస్తావన తీసుకువచ్చారట. అవసరమైతే రాష్ట్ర హక్కుల సాధనకు కాంగ్రెసు సహకారం తీసుకోవాలని బలంగా చెప్పారని సమాచారం. ఈ విధంగా చంద్రబాబు పార్టీలోని నేతల మనోభావాలను తెలుసుకునేందుకు సంకేతాలు వదులుతున్నారని సమాచారం. మరోవైపు ప్రజల్లో కాంగ్రెసుపై గతంలో పేరుకున్న వ్యతిరేకత క్రమేపీ తగ్గుముఖం పట్టిందన్న వాదనను టీడీపీ వినిపిస్తోంది. బీజేపీ, వైసీపీని ఈ నేపధ్యంలో ఒకే గాటన కట్టేస్తోంది. పొత్తులు ఎవరితో ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయో అదే పార్టీలో కలిసి ముందకు వెళతాం అంటున్న చంద్రబాబు ప్రజలను ఆ దిశగా ఒప్పించి బీజేపీని దెబ్బకొట్టాలని ప్రణాళిక రిచిస్తున్నారు. బాబు వ్యూహాలు ఎంతవరకు నెరవేరతాయో చూడాలి.