ఏపీ రాజధానుల పోరు-పొలిటికల్ యాత్రలకు బ్రేక్ ! రాజకీయ పార్టీలకు సీన్ అర్ధమైందా ?
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా మారిన పోరు కాస్తా తాత్కాలికంగా చల్లబడింది. ముఖ్యంగా అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వం మరోవైపు అమరావతి పాదయాత్ర చేస్తున్న రైతుల్ని జేఏసీ ర్యాలీలతో టార్గెట్ చేసింది. అయితే చివరికి వాస్తవ పరిస్దితి అర్ధమైన ఇరువర్గాలూ ఇప్పుడు తమ యాత్రలకు బ్రేక్ ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూడక తప్పని పరిస్దితి ఎదురవుతోంది.
అమరావతి వర్సెస్ మూడు రాజధానులు
ఏపీలో అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్.. వాటిని అమల్లోకి మాత్రం తీసుకురాలేకపోయింది. అదే సమయంలో మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని కోసం ఉద్యమించిన రైతులు.. హైకోర్టుకు వెళ్లి అమరావతినే రాజధానిగా ఖరారు చేసేలా తీర్పు తెచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వం తిరిగి సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేసింది. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అదే సమయంలో అమరావతిపై రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు రైతులు పాదయాత్ర ప్రారంభించగా.. వైసీపీ నాన్ పొలిటికల్ జేఏసీలు ఏర్పాటు చేసి,వాటితో ర్యాలీలు చేయించి కౌంటర్ ఇచ్చింది.
అమరావతి పాదయాత్రకు బ్రేక్
అమరావతిలోనే రాజధాని కోరుతూ వైసీపీ సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు రైతులు చేపట్టిన పాదయాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రైతులపై పోలీసులు ఒత్తిడి పెంచడం, ఆంక్షలు సడలించేందుకు హైకోర్టు కూడా ససేమిరా అనడంతో పాదయాత్ర నిలిచిపోయింది. తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పిన రైతులు... ఇప్పటివరకూ మౌనంగానే ఉండిపోతున్నారు. దీంతో ఇక పాదయాత్ర తిరిగి ప్రారంభం కావడం కష్టమేనని తేలిపోయింది.
వైసీపీ-జేఏసీ ర్యాలీలకూ బ్రేక్
ఓవైపు అమరావతి రైతులు పాదయాత్రకు బ్రేక్ పెట్టిన నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీతో కలిసి వైసీపీ చేపడుతున్న ర్యాలీలు కూడా నిలిచిపోయాయి. రైతులు పాదయాత్ర చేపట్టగానే దానికి నిరసనగా వైసీపీ శ్రేణులు నల్ల జెండాలతో ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. పోటాపోటీ నినాదాలు చేశారు. పలుచోట్ల రాళ్లు కూడా రువ్వారు. కానీ ఓసారి అమరావతి పాదయాత్ర నిలిచిపోగానే క్రమంగా వైసీపీ-జేఏసీ పర్యాలీలు కూడా నిలిచిపోయాయి. తిరిగి అమరావతి రైతుల నుంచి ఏదైనా నిర్ణయం వెలువడితే దానికి అనుగుణంగా వీటిని ప్రారంభించే అవకాశముంది.
సుప్రీంవైపే అందరి చూపూ..
రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో రాజకీయంగా పరస్పరం ఒత్తిడి పెంచేందుకు అమరావతి పాదయాత్రతో పాటు వైసీపీ-జేఏసీ ర్యాలీలు సాగాయి. కానీ చివరికి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకముందే దూకుడుగా వ్యవహరిస్తే ఆ ప్రభావం విచారణపై పడే అవకాశం ఉందన్న సంకేతాలతో ఇరువర్గాలూ శాంతించినట్లు తెలుస్తోంది. అలాగే సుప్రీంకోర్టు కూడా రాజధానుల పిటిషన్లపై కీలక తీర్పు వెలువరించేందుకు రాష్ట్ర పరిణామాల్ని సమగ్రంగా అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో అందరి చూపూ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఉంది.