తీపికబురు..ఆ శాఖలో త్వరలో 5వేల పోస్టుల భర్తీ!
తెలంగాణా రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖను పటిష్టం చెయ్యాలని, ఎలాంటి ఖర్చు లేకుండా, ఉచితంగా రోగులకు వైద్య ఆరోగ్య సేవలు అందాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో అనేక కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులను పటిష్టం చేయటంతో పాటు, టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేస్తుంది.
వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీపై శుభవార్త
త్వరలోనే ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందించాలని ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీపై శుభవార్త చెప్పింది. తాజాగా ఇంటర్నేషనల్ నర్సుల దినోత్సవంలో నర్సులు 1919 మందికి నియామక పత్రాలను అందించిన హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ రానున్న రోజులలో మరో 5 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.

త్వరలో మరో 5 వేల పోస్టుల భర్తీ
కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో 13వేల పోస్టులను భర్తీ చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు నర్సింగ్ లో 9వేల పోస్టులను భర్తీ చేశామన్నారు. త్వరలో మరో 5 వేల పోస్టుల భర్తీలో సుమారు 2వేల ఏఎన్ఎం పోస్టుల ఫలితాలు మరో ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. న్యాయపరమైన కారణాలతో ఆలస్యమైన 732 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీని కూడా త్వరలో పూర్తి చేస్తాం అన్నారు .
కొత్తగా 16 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల ఏర్పాటు
ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ పూర్తిస్థాయిలో సిబ్బందితో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. దేశీయ, అంతర్జాతీయ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నర్సింగ్ విద్యను విస్తరిస్తున్నామన్నారు. ఈ రెండేళ్లలో కొత్తగా 16 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అందులో 960 బీఎస్సీ నర్సింగ్ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
నర్సుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి కోసం ప్రత్యేక నర్సింగ్ డైరెక్టరేట్
విద్యానంతరం విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్స్ను ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు నేర్పిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా జర్మన్, జపాన్ దేశాల్లో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఆ రెండు భాషలతో పాటు, ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం అన్నారు . రాష్ట్రంలో దాదాపు 1 లక్షా 80 వేల మంది రిజిస్టర్డ్ నర్సులు సేవలందిస్తున్నారని .వారి సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి కోసం ప్రత్యేక నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.
ట్రైనింగ్, స్కిల్ అప్గ్రేడేషన్ కార్యక్రమాలు
వైద్యరంగంలో మార్పులకు అనుగుణంగా నర్సులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరం ట్రైనింగ్, స్కిల్ అప్గ్రేడేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అంతేకాదు దశల వారీగా అవసరాన్ని బట్టి ఉద్యోగాల కల్పన చేపడతామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications