రెచ్చిపోతున్న నేపాలీ ముఠా: మొన్న ఐపీఎస్..నేడు ప్రొఫెసర్- తస్మాత్ జాగ్రత్త..!!
మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే.. హైదరాబాద్ శివారు జవహర్నగర్ పరిధిలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి నేపాలీ ముఠా ఒక విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. నగర శివారులోని Golf Enclave, Kowkoor కాలనీలో జరిగిన ఈ ఘటన భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పనిమనుషులుగా చేరి..
కాగా పోలీసుల వివరాల ప్రకారం.. విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మీ నివాసంలో కొంతకాలం క్రితం ఒక నేపాలీ జంట పనిమనుషులుగా చేరారు. ఇంటి పనులు, దినచర్యలు నిర్వహిస్తూ దంపతుల విశ్వాసాన్ని సంపాదించారు. అయితే ఇటీవల వారు మరో మహిళను తమ బంధువుగా పరిచయం చేస్తూ ఇంట్లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇలా కొద్ది రోజులుగా ఇంటి పరిస్థితులు, దంపతుల అలవాట్లు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులపై పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే ఈ ముఠా దోపిడీకి పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బర్త్డే వేడుక పేరుతో కుట్ర..
ఈ మేరకు నేపాలీ మహిళ తన పుట్టినరోజు వేడుకలను ఇంట్లోనే చేసుకోవాలని ప్రొఫెసర్ దంపతులను కోరింది. దీనికి వారు అంగీకరించగా.. 'బర్త్డే సెలబ్రేషన్' పేరుతో మరో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి తీసుకొచ్చారు. కేక్ కొనివ్వాలని చెప్పడంతో ప్రొఫెసర్ దంపతులే వెళ్లి కేక్ తీసుకొచ్చారు. వేడుకలు జరుగుతున్నట్లే కనిపించినా, అసలు లక్ష్యం ఇంట్లో దోపిడీ చేయడమేనని తర్వాత బయటపడింది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో, దంపతులపై వెనుక నుంచి దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. వారిని తీవ్రంగా బెదిరించి చేతులు కట్టేశారు. "మీకు కావాల్సింది తీసుకెళ్లండి.. కానీ మమ్మల్ని చంపొద్దు" అంటూ బాధితులు వేడుకున్నట్లు సమాచారం. అనంతరం ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, పత్రాలు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తం దోపిడీ విలువ లక్షల్లో ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
మత్తుమందు ఇచ్చి గదిలో బంధించిన వైనం..
ఇక దోపిడీ అనంతరం దంపతులకు మత్తుమందు ఇచ్చిన దుండగులు, వారిని ఒక గదిలో బంధించారు. ఇంటి ప్రధాన తలుపులతో పాటు అన్ని గేట్లకు తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. మత్తు ప్రభావంతో దంపతులు మంగళవారం మధ్యాహ్నం వరకు స్పృహలోకి రాలేదని చెబుతున్నారు. ఆ తర్వాత తేరుకున్న వారు కిటికీ దగ్గరకు వెళ్లి సహాయం కోసం అరవడంతో.. వారి అరుపులు విన్న కాలనీ వాసులు వెంటనే ఇంటి వద్దకు చేరుకుని తలుపులు తెరిచి వారిని బయటకు తీసుకొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి.. బాధితులను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కాలనీలో ఇటీవల అనుమానాస్పదంగా తిరిగిన కొంతమందిని గమనించినట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో ఈ దోపిడీలో కనీసం ఏడుగురు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, పనిమనుషుల ఫోన్ కాల్ డేటా, ఆధార్, చిరునామా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ మేరకు ఘటనాస్థలికి Malkajgiri CP Sumathi చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఇటీవల జవహర్నగర్ పరిసరాల్లో వరుసగా జరుగుతున్న నేరాలు స్థానికుల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. ముఖ్యంగా ఇంటి పనుల కోసం నియమించుకునే వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. "తెలియని వ్యక్తులను నమ్మే ముందు పూర్తి వివరాలు సేకరించాలని .. స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఈ ఘటనతో నగర శివార్లలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications