ఏపీలో ఇంటింటి రేషన్కు బ్రేక్- కోవిడ్ వ్యాప్తి, ఎండీయూల మెరుపు సమ్మే కారణం
ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంటింటికి రేషన్ పంపిణీ పథకానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఎండీయూలు రేషన్ పంపిణీని నిలిపివేసి ఆకస్మిక సమ్మెకు దిగారు. దీంతో ఈ పథకం అమలుకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. దీనికి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది.
గతంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి తరచుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీఎం జగన్ బొమ్మతో ఎన్నికల సమయంలో రేషన్ వాహనాలు తిరగడం ఎన్నికల కోడ్కు విరుద్దమని గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ వాటిని నిలిపేశారు. కోర్టు జోక్యంతో ఇవి తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కరోనా ప్రభావంతో ఎండీయూలు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో మరోసారి ఇంటింటికి రేషన్ పథకానికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఇటీవల ఎండీయూలకు సరుకు ఇచ్చే క్రమంలో కరోనా సోకి విజయవాడలో ముగ్గురు రేషన్ డీలర్లు చనిపోయారు. దీంతో ఎండీయూలతో పని చేయించలేక డిపోల్లోనే పంపిణీ చేయాలని డీలర్లపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అధికారుల తీరుతో రేషన్ డిపోలు కరోనా కేంద్రాలుగా మారతాయని డీలర్లు భయపడుతున్నారు. దీంతో వారు కూడా డెలివరీకి అంగీకరించడం లేదు. మరోవైపు ఎండీయూలు అధికారుల తీరుపై ఆగ్రహంతో మెరుపుసమ్మెకు దిగారు. మూడురోజులుగా పంపిణీ నిలిచిపోయింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమకు వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించే వరకూ తాము విధుల్లోకి రాబోమని ఎండీయూలు చెప్తున్నారు.