పోస్టుమార్టం చేసేందుకు లంచం డిమాండ్: ఉదయగిరి ఆస్పత్రిలో ఘటన; మంత్రి రజినీకి కొత్త తలనొప్పి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో వరుస ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక దివ్యాంగురాలు పై అత్యాచార ఘటన తర్వాత, రుయా ఆసుపత్రిలో బాలుడు మృతదేహాన్ని తండ్రి బైక్ మీద తీసుకువెళ్ళిన ఘటన చోటు చేసుకుంది. ఇక పలు ఆసుపత్రుల్లో వసతులు లేక రోగులు పడుతున్న ఇబ్బందులు, వాటర్ ట్యాంక్ కింద చికిత్స తీసుకుంటున్న గర్భిణీ స్త్రీలు ఇలాంటి ఘటనలతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి కూడా వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపుతుంది.

పోస్ట్ మార్టం కోసం లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ వైద్యుడు
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన ఆసుపత్రులలో పరిస్థితికి అద్దం పడుతుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడి లంచావతారం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆర్థిక సమస్యలతో సతమతం అయిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు.

16 వేలు లంచం ఇవ్వాలని మహిళను డిమాండ్ చేసిన వైద్యుడు
భర్త మరణించాడని ఆవేదన లో ఉన్న మహిళ పోస్టుమార్టం జరిగితే భర్త మృతదేహాన్ని తీసుకు వెళ్లాలని ఆసుపత్రి వద్ద రోదిస్తూ కూర్చుంది. అసలే భర్త చనిపోయిన బాధలో ఉన్న మహిళ దగ్గరకు వెళ్లిన ప్రభుత్వ వైద్యుడు పోస్టుమార్టం చేయడానికి 16 వేల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్యను ఫోన్ పే ద్వారా తనకు డబ్బులు పంపాలంటూ ఇబ్బంది పెట్టాడు. లేదంటే తాను రాసే పోస్ట్ మార్టం రిపోర్ట్ తో ఇబ్బంది పడ్డాల్సి వస్తుందని బెదిరించాడు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మహిళ.. వైద్యుడికి షాక్
అసలే భర్త పోయిన బాధలో తీవ్ర మనస్థాపంతో ఉన్న బాధిత మహిళ దిక్కుతోచని స్థితిలో వైద్యుడు భాషాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు డాక్టర్ భాషాపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ డిమాండ్ చేస్తుంది. ఇక ఈ ఘటన శవాల మీద కూడా డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల తీరును స్పష్టంగా చూపిస్తుంది. మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చెయ్యటంతో భాషాకు షాక్ తగిలినట్టు అయ్యింది.

ప్రభుత్వాసుపత్రుల్లో అవినీతికి మంత్రి విడదల రజినీ చెక్ పెడతారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విడదల రజిని ఆసుపత్రులలో చోటుచేసుకుంటున్న ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని, ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన మంత్రి విడదల రజిని ప్రభుత్వాసుపత్రుల్లో పేరుకుపోతున్న అవినీతి పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మౌలిక సదుపాయాల కల్పన, ఆసుపత్రి వైద్యుల తీరు, ఆసుపత్రులలో అందుతున్న వైద్య చికిత్సలు తదితర అంశాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వైద్య ఆరోగ్య శాఖలో చోటు చేసుకుంటున్న రోజుకో ఘటనతో ఇబ్బంది పడుతున్న మంత్రి ఈ సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారు అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications