'నోరు జాగ్రత్త! పురంధేశ్వరిని అంటారా, 2019లో బాబుకు బిజెపి చుక్కలు'
రాజమహేంద్రవరం: బడ్జెట్ నేపథ్యంలో నిన్నటి వరకు మిత్రపక్షాలైన తెలుగుదేశం, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ నేపథ్యంలో టిడిపి రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే సత్యనారాయణ బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ నేతల పైన విరుచుకుపడ్డారు.
బిజెపి నేతల పైన వ్యాఖ్యానించే ముందు టిడిపి నేతలు ఓసారి ఆలోచించుకోవాలని, బిజెపి నేతల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. బిజెపి నేతలు బిచ్చగాళ్లు కాదన్నారు. తమ పార్టీ నేతల పైన మరోసారి విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
2019 ఎన్నికల సమయంలో బిజెపి సామర్థ్యం, తమ పార్టీ శక్తిని చూపిస్తామన్నారు. మరో మూడేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి తాము బుద్ధి చెబుతామన్నారు.

మాజీ కేంద్రమంత్రి, తమ పార్టీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను టిడిపి నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కేంద్రానికి సహకరించాలని పురంధేశ్వరి చెప్పారని, అందులో తప్పేముందని అభిప్రాయపడ్డారు.
పోలవరం గురించి పూర్తి వివరాలు కేంద్రానికి ఇవ్వడంలో టిడిపి ఫెయిల్ అయిందని, అందుకే రూ.1200 కోట్లు అడిగితే రూ.100 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఈ విషయం తాము తప్పనిసరి పరిస్థితుల్లోనే చెబుతున్నామన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, విభజన హామీలు నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్రంతో సన్నిహితంగా ఉండాలని ఎమ్మెల్యే సత్యనారాయణ సూచించారు. బిజెపి ప్రతి హామీని నెరవేరుస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications