పవన్ పెద్ద తప్పే చేస్తున్నారా?: ఈ విషయంపై ఎందుకని ఫోకస్ చేయట్లేదు!
ఇక్కడిదాకా బాగానే అనిపించినా.. అవన్నీ ఆచరణ రూపం దాల్చడంలోనే అసలు జాప్యం. ప్రభుత్వ హామిలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో తెలియదు. వాటి ఫాలో అప్ చేసేవారు లేరు.
హైదరాబాద్: ప్రజల్లో బలమైన ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి తమ సమస్యపై గొంతెత్తితే ప్రభుత్వాలు కరుణిస్తాయేమోనన్న ఆశ.. చాలామందిని ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' వద్దకు చేరుస్తోంది. చేనేత కార్మికులు, ఉద్దానం కిడ్నీ బాధితులు, తుందుర్రు ఆక్వా రైతులు.. వీళ్లంతా ఇదే ఆశతో పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించారు.
తుందుర్రు పర్యటనకు సిద్దమైన జనసేన: మెగా ఆక్వా ఫుడ్పై అధ్యయనం!
వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పవన్ కూడా వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమవుతూ వస్తున్నారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా.. ఆ సమస్యల పురోగతిని, వాటి పట్ల ప్రభుత్వ చర్యలను పరిశీలించే వైఖరిలో మాత్రం పవన్ పట్టి లేనట్టుగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఎదురువుతోంది.
ఆక్వా రైతుల సమస్య పరిష్కారమైందా?:
తుందుర్రులో ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టడంతో అక్కడి ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్యాక్టరీతో పంట కాలువ నీళ్లు కలుషితమవుతాయని, దానివల్ల తమ జీవనాధారం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మొత్తానికి వారి అభ్యర్థనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. తుందుర్రు గ్రామంలో కాకుండా సముద్ర తీరప్రాంతానికి ఆక్వా ఫ్యాక్టరీని తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం నచ్చజెప్పే ప్రయత్నమే చేసిందే తప్పా.. ఫ్యాక్టరీని తరలించే యోచనలో లేదు.
దీంతో ఆక్వా రైతుల ఆవేదనకు పరిష్కారం లభించనట్టయింది. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై మళ్లీ అంతగా దృష్టి సారించలేదు. కాబట్టి ప్రభుత్వం తన చర్యలను మరింత సులువుగా అమలు చేసే అవకాశం చిక్కింది.
ఉద్దానం 'కిడ్నీ' సమస్య సంగతేంటి?
ఉద్దానం బాధితుల గోడు చూడలేక పవన్ కళ్యాణ్ అక్కడికి నేరుగా వెళ్లి స్పందించడం ప్రశంసనీయం. తద్వారా వారి ఆవేదనను ప్రభుత్వానికి తెలిసేలా చేశారు. ప్రభుత్వం కూడా వారికి ఉచిత బస్ పాస్ లు.. చికిత్స కోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చింది.
ఇక్కడిదాకా బాగానే అనిపించినా.. అవన్నీ ఆచరణ రూపం దాల్చడంలోనే అసలు జాప్యం. ప్రభుత్వ హామిలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో తెలియదు. వాటి ఫాలో అప్ చేసేవారు లేరు. దీంతో పవన్ కళ్యాణ్ స్పందించడం వరకు మంచి విషయమే అయినా.. సమస్యలు పూర్తి పరిష్కారమయ్యే వరకు చొరవ చూపితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజధాని రైతుల విషయంలోను..
పవన్ రాజధాని ప్రాంత రైతులను కలిసినప్పుడు కూడా తమకు న్యాయం జరగకపోదా? అని అక్కడి రైతులు భావించారు. ప్రభుత్వం కూడా బలవంతంగా భూములు లాక్కోబోమని ప్రకటనలు చేసింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం యథావిధిగా తన పని తాను చేసుకుపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కాబట్టి రాజధాని రైతుల విషయంలో పవన్ కళ్యాణ్ స్పందన ఆరంభ శూరత్వానికే మిగిలిపోయింది తప్ప.. అసలు పరిష్కారాన్ని పట్టివ్వలేదన్నది ఆయనపై ఉన్న విమర్శ.
ఇప్పుడు నేతలన్న గోడు:
చేనేత కార్మికులపై స్పందించిన పవన్ కళ్యాణ్.. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానంటూ స్వచ్చందంగా ముందుకొచ్చారు. వారంలో ఒకరోజు చేనేత దుస్తులనే ధరిస్తానని హామి కూడా ఇచ్చారు.
చేనేతకు పవన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం వరకు బాగానే ఉంది గానీ.. నేతన్నల సమస్యల పరిష్కారం కోసం పవన్ ఎంత మేర కృషిచేస్తారన్నదే ఇప్పుడు ప్రతీ ఒక్కరి మదిలో మెదులుతోన్న ప్రశ్న. సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేదాకా ఆయన వారికి అండగా ఉంటే బాగుంటుంది.
అలా కాకుండా ఇంతకుముందు తరహాలోనే.. సమస్య చివరి దాకా పవన్ నిలబడకపోతే.. మరిన్ని విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తుంది.