'జగన్! ఆడవాళ్లు కారం పెట్టి కొడతారు, టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యేలు'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని, వచ్చే ఏడాది ఎన్నికలు ఎలా వస్తాయన్నారని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి 2019 వరకు అవకాశముండగా, వచ్చే ఏడాది ఎన్నికలు ఎలా వస్తాయని టిడిపి నేత బుద్ధా వెంకన్న గురువారం నిప్పులు చెరిగారు.
తన్ని తరిమేసిన చరిత్ర, రైతులకు అత్యాశ.. ఇదీ చంద్రబాబు ప్రచారం: జగన్
రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత తన వద్ద ఉన్న బ్లాక్ మనీ ఎలా మార్చుకోవాలో తెలియక జగన్ మతిభ్రమించి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తాయంటూ పగటి కలలు కంటున్నారన్నారు.
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని చెప్పారు. అలాంటప్పుడు వచ్చే ఏడాది ఎన్నికలు ఎలా వస్తాయో చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారంటూ జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.
బందరు పోర్టుకు భూములివ్వడానికి అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసి కూడా జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారన్నారు. భూముల విషయంపై జగన్ బహిరంగ విచారణకు రావాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు తన ప్రయోజనాల కోసం ఎక్కడా భూములు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తీసుకుంటున్నారని చెప్పారు. భూసమీకరణ విధానంలో పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చిన తర్వాతే రైతుల నుంచి భూములు తీసుకుంటామని చెప్పారు.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. అభివృద్ధికి అడ్డుపడటం జగన్కు అలవాటు అన్నారు. రాజధాని వద్దని, బందరు పోర్టు వద్దని, ఫుడ్పార్క్ వద్దని, బోగాపురం ఎయిర్ పోర్టు వద్దని, పట్టిసీ వద్దని ఇలా.. ప్రతి దానికి అడ్డుపడుతున్నారన్నారు.
బాబు లాక్కోవడం వెనుక పెద్ద ప్లాన్, అలా ఐతే ఏడాదిలో ఎన్నికలు: బాంబు పేల్చిన జగన్
జగన్ చర్యలతో విసిరి వేసారిపోయిన ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తున్నారని చెప్పారు. మరికొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి రావడం ఖాయమన్నారు.
చాలామంది వస్తామని చెబుతున్నప్పటికీ తామే హౌస్ఫుల్ బోర్డు పెట్టేశామన్నారు. జగన్ రెచ్చగొడితే రానున్న రోజుల్లో ప్రజలు రాళ్ళతో కొడతారని, ఆడవాళ్ళు కారం చల్లుతూ తరిమి కొడతారని హెచ్చరించారు. జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దన్నారు.