BUDGET 2024: ఏపీ ప్రత్యేకహోదా కోసం బడ్జెట్ అడ్డుకోండి: ఎంపీలకు వీవీ లక్ష్మీనారాయణ పిలుపు!!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేడు పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అయినా రాష్ట్రాలను ఉద్దేశించి కీలక ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు. అయితే ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ ఉంటుందని అందరి అంచనా.
అయితే ఈసారి ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్లో మోడీ సర్కార్ రైతులు, మహిళలు మరియు వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రవేశపెడుతున్న తాత్కాలిక పద్దులలోను వరాల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో ప్రత్యేక హోదా సాధించడానికి ఇది గొప్ప అవకాశం అని సిబిఐ మాజీ జెడి, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఏపీలోని రాజకీయ నేతలకు పిలుపునిచ్చారు. విభజన హామీలను నెరవేర్చాలని ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ తో ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను అడ్డుకోవాలని ఆయన ఏపీ ఎంపీలను కోరారు. ఇప్పుడు గట్టిగా పట్టు పట్టటం ద్వారా ప్రత్యేక హోదాను సాధించుకోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పాస్ కాకుండా అడ్డుకుని ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులను డిమాండ్ చేశారు. నిన్న విశాఖపట్నంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ ఒకరోజు నిరసన దీక్షను చేపట్టారు.
తన దీక్షకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని, బడ్జెట్లో ఏపీకి న్యాయబద్ధంగా రావలసిన ప్రత్యేక హోదాను, విభజన చట్టం ప్రకారం కేటాయించవలసిన నిధులను కేటాయించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications