హోదా కోసం వెల్లోకి చొచ్చుకెళ్లిన ఎంపీలు, గందరగోళం: టీడీపీ ఎంపీలతో అమిత్ షా భేటీ!
Recommended Video
న్యూఢిల్లీ: బడ్జెట్ మలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే విభజన హామీలపై ఏపీ ఎంపీలు, ఇతర అంశాలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. గందరగోళం ఏర్పడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోకసభను మొదట 12 గంటల వరకు వాయిదా వేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలోను ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ఎంపీలు వెల్లోకి చొచ్చుకు వచ్చారు. దీంతో రాజ్యసభ కూడా కాసేపటికే వాయిదా పడింది. ఎపీ ఎంపీల ఆందోళనతో కాసేపటికే ఉభయ సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత లోకసభ తిరిగి ప్రారంభమైనా విపక్షాలు, ఏపీ ఎంపీల ఆందోళన కారణంగా రేపటికి (మంగళవారం)కు వాయిదా పడింది.
అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ
పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షులు అమిత్ షా మిత్రపక్షమైన టీడీపీ ఎంపీలతో మాట్లాడనున్నారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఆయన మాట్లాడనున్నారని తెలుస్తోంది.
కేంద్రంపై ఒత్తిడి ప్రయత్నాలు
బీజేపీ ముందు టీడీపీ 19 డిమాండ్లు ఉంచింది. ఈ డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లోను నెరవేర్చాలని కోరుతోంది. అప్పటి దాకా నిరసనలు తెలియజేస్తామని చెప్పింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆందోళనతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు
ఏపీకి హోదా కోసం టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద తమ నిరసన తెలిపారు. ప్లకార్డులు చేతబట్టుకొని ఏపీకి న్యాయం చేయాలని నిదించారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు వెంకటేశ్వర స్వామి విగ్రహం, పవిత్ర గ్రంథాలు పట్టుకొని ఆందోళనలు తెలిపారు. ఎంపీ శివప్రసాద్ కృష్ణుడి రూపంలో నిరసన తెలిపారు.
రాజ్యసభ వాయిదా
రాజ్యసభ ప్రారంభం కాగానే ఏపీ ఎంపీలు హోదా కోసం నినాదాలు చేశారు. వెల్లోకి వెళ్లారు. విపక్ష ఎంపీలు నీరవ్ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఇరవై నిమిషాల పాటు వాయిదా పడింది.