ఇల్లు కట్టుకునేందుకు 4 ఎకరాల భూమా..? పయ్యావుల కేశవ్పై మంత్రి బుగ్గన ఫైర్
మూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. రాజధాని ప్రాంతం ఇక్కడే వస్తోందని తెలుసుకొని టీడీపీ ముఖ్య నేతలు భూములు కొనుగోలు చేశారనే అంశంపై ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పయ్యావుల విక్రమ సింహ పేరుతో పయ్యావుల కేశవ్ 4 ఎకరాల భూమి కొనుగోలుపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వర్సెస్ కేశవ్ మధ్య హాట్ హాట్ డిస్కషన్ జరిగింది.

ఇన్సైడర్ ట్రేడింగ్
అమరావతి రాజధానిపై మంత్రివర్గ సమావేశం 1-9-2014న ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. 4-9-2014న అసెంబ్లీలో చర్చ జరిగిందని వివరించారు. కానీ తాను 40 రోజుల తర్వాత భూమి కొనుగోలు చేశానని చెప్పారు. రాజధానిలో తనకు ఇల్లు ఉండాలనే ఉద్దేశంతోనే భూమి కొనుగోలు చేశానని చెప్పారు. అయితే సీఆర్డీఏ చట్టం డిసెంబర్ 30వ తేదీన అమల్లోకి వచ్చిందని.. అంతకుముందే పయ్యావుల కేశవ్ భూమి కొనుగోలు చేయడంతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బుగ్గన బలంగా వాదనలు వినిపించారు.

పయ్యావుల వర్సెస్ బుగ్గన
మంత్రి బుగ్గన వాదనలను పయ్యావుల కేశవ్ ఖండించారు. అసత్యాల పునాదుల వాదించి నెగ్గుతామంటే చేసేదేమీ లేదన్నారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతుంటే.. తప్పుడు సమాచారం ఇస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కల్పించుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో 4 వేల ఎకరాల భూమిని రాజధాని ఇక్కడ వస్తోందని ఇన్ సైడర్ ట్రేడింగ్ కింద కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన తెలిపారు. విజయవాడ-గుంటూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గల లింగాయపలెం, మోదుగుపాలెం, మల్కాపురం, తుళ్లూరు, తాడేపల్లి, కురగళ్లు, నౌరుళ్లు, ఉండవల్లిలో భూములు కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన చెప్పారు. అంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టేనని అర్థమవుతోందన్నారు.

ఆ గ్రామాల్లోనే..
అదే నూజివీడు, నాగార్జున యూనివర్సిటీలో ఎందుకు భూమి కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. ఆ రెండు పత్రికలు కూడా రాజధాని వస్తోందని కథనాలు రాశాయి కదా.. మరి ఇక్కడే కొనుగోలు చేయడంతో ఆంతర్యం ఏంటి అని అడిగారు. అయితే రాజధాని ఇక్కడ వస్తోందని కొందరికీ మాత్రమే తెలుసునని చెప్పారు. మంత్రి బుగ్గన కామెంట్లపై కేశవ్ కూడా అదేస్థాయిలో విరుచుకుపడడారు.

జగన్ పత్రికలో
అమరావతి రాజధాని నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన పత్రిక కూడా కథనాలు రాసిందని గుర్తుచేశారు. 10 లక్షల సర్క్యులేషన్ ఉన్న పేపర్లో కూడా గ్రామాల గురించి రాశారు కదా అని వివరించారు. అమరావతి రాజధాని ప్రకటంచాక కేవలం 124 ఎకరాల భూమి మాత్రమే కొనుగోలు జరిగాయని పయ్యావుల కేశవ్ అన్నారు. అందులో 80 ఎకరాల భూమి ఎస్సీ, ఎస్టీలకు చెందినవి అని.. వాటినే వారు కొనుగోలు చేశారని చెప్పారు. తాను కొనుగోలు చేసిన భూములపై విచారణకు ఓకే అని.. దాంతోపాటు విశాఖలో కొనుగోలు చేసిన భూములపై కూడా విచారణ జరిపించాలని పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications