బాలిక కిడ్నాప్: 3రోజుల పాటు రేప్, చర్చ్ కూలి 30 మందికి గాయాలు
విశాఖ/భీమవరం: విశాఖ జిల్లాలోని గోపాలపట్నం పరిధిలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో షాకింగ్ విషయం తెలిసిందే.
మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు మూడు రోజుల పాటు ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం ఆమెను బస్టాండులో వదిలి పెట్టి వెళ్లారు. బాలిక పరిస్థితి గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
నిర్మాణంలో ఉన్న చర్చి కూలి గాయాలు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి కూలిపోయి దాదాపు ముప్పై మంది గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం చర్చి రెండో ఫ్లోర్లో శ్లాబ్ వేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.