ఇదీ జరిగింది, జగన్ ఛీకొట్టినా ఉండాలా: బాబును కలిసిన వేదవ్యాస్, 21న టిడిపిలోకి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. పెడన నియోజకవర్గ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ఈ నెల 21వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబును కలిశారు.
ఆయన నిన్ననే (శనివారం నాడు) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఈ రోజు చంద్రబాబును కలిశారు. 21వ తేదీన చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు. ఇది జగన్కు పెద్ద దెబ్బే అంటున్నారు. ఆయన గత ఎన్నికల్లో పెడన నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అవమానాలు భరించాలా?
వేదవ్యాస్ శనివారం సాయంత్రం పెడనలోని బ్రహ్మపురం దేవాంగ కల్యాణ మండపంలో నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశమయ్యారు. దీనిలో వేదవ్యాస్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. తాను అవమానాలను భరిస్తూ ఛీ అంటూ ఛీత్కారాలు కొట్టే వైకాపాలో ఉండాలా లేదా తనకు సముచిత ప్రాధాన్యమిస్తామని ఆహ్వానిస్తున్న అధికార పార్టీలోకి వెళ్లాలా అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు.
వేదవ్యాస్ దాదాపు అరగంట పాటు మాట్లాడారు. 2014 ఏప్రిల్ 14న వైసిపిలోకి వెళ్లి పెడన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను వివరించారు. నియోజకవర్గంలో పార్టీకి ఏజెంట్లు లేని పరిస్థితుల్లో తాను వైసిపి తరపున 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పొందానన్నారు.
అప్పటినుంచి పార్టీలో సరైన గౌరవం లభించటంలేదని వాపోయారు. కైకలూరులో పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పొందిన ఉప్పాల రాంప్రసాద్ను ఇక్కడ కన్వీనర్గా నియమించి తనను పక్కన పెట్టారని ఆరోపించారు. ఇక కంకిపాడులో గతేడాది నిర్వహించిన వైసిపి జిల్లా సమావేశంలో ప్రజాప్రతినిధుల్ని, మాజీ ప్రజాప్రతినిధుల్ని వేదిక పైకి ఆహ్వానించి తనను నిర్లక్ష్యం చేశారన్నారు.
ఆ రోజునే పార్టీకి రాజీనామా చేద్దామనే ఆలోచన వచ్చిందన్నారు. తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలను ముందుగా జిల్లా కన్వీనర్ పార్థసారధితో పాటు సామినేని ఉదయభాను ఇతర నేతల దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇటీవల పలుమార్లు జగన్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. తనపై కొందరు జగన్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు.