బస్సు ప్రమాదం: ఆంధ్రప్రదేశ్కు చెందిన మృతులు వీరే
మహబూబ్నగర్: బుధవారం తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు ఫరూఖ్ అలీ - నాచారం (హైదరాబాద్), అక్షయ్సింగ్ - ఆర్టీసీ క్రాస్రోడ్ (హైదరాబాద్), సురేష్బాబు-శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్), చంద్రశేఖర్- కేపీహెచ్బీ కాలనీ (హైదరాబాద్), మంజునాథ్రెడ్డి - కవాడిగూడ (హైదరాబాద్), టి.సురేష్- మచిలీపట్నం (కృష్ణా జిల్లా), అడారి రవి - నర్సీపట్నం(విశాఖ జిల్లా), వేదవతి - కామారెడ్డి మండలం దేవునిపల్లి ( నిజామాబాద్ జిల్లా), గాలి బాల సుందర్రాజు, గాలి మేరి, గాలి విజయకుమారి - నర్సారావుపేట(గుంటూరు జిల్లా), అమరేందర్- కరీంనగర్.
ఉద్యోగం వచ్చింది, ప్రాణం పోయింది
బస్సు ప్రమాద ఘటనలో కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన టి. సురేష్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సురేష్ బెంగుళూరులో ఇంటర్వ్యూకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెచ్పీ కంపెనీలో సురేష్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయ్యానని ఏడాదికి రూ.7 లక్షల వేతనమని మంగళవారంసాయంత్రం సురేష్ తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. సురేష్ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నారు.
బస్సు ప్రమాదంలో మృతులకు సంఘటనా స్థలంలో పోస్ట్ మార్టం నిర్వహించేందుకు హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మహబూబ్నగర్ జిల్లాకు బయల్దేరి వచ్చారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణుల వైద్య బృందం ఘటనాస్థలానికి చేరుకున్నారు.
బొత్స హామీ
మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై పిసిసి అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రిబొత్ససత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని ఆయన మీడియాతో విశాఖపట్నం జిల్లాలో అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రజలు ఆర్టీసీ బస్సులను వదిలి ప్రైవేటు బస్సుల వెంట పడుతున్నారని బొత్స వ్యాఖ్యానించారు.
మహబూబ్నగర్జిల్లాలో బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లాకు చేరుకున్న నారా లోకేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.