అయ్యప్ప భక్తుల బస్సుకు ప్రమాదం - ఆరా తీసిన వైఎస్ జగన్..!!
అమరావతి: లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ నెల 16వ తేదీన 5 గంటలకు శాస్త్రోక్తంగా మణికంఠుడి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ మరుసటి రోజు నుంచి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. రెండు నెలల పాటు అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనం ఇస్తాడు. మండలం తరువాత ఆలయాన్ని మూసివేస్తారు.
స్వామి వారి ఆలయం తలుపులు తెరచుకున్న తొలి రోజు నుంచే భక్తులు అయ్యప్పుడి దర్శనానికి పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల వేలాదిమంది ప్రత్యేక వాహనాల్లో శబరిమలకు బయలుదేరి వెళ్లారు. పంబా నదిలో పవిత్ర స్నానాలను ఆచరించిన అనంతరం శబరిమలను దర్శించుకుంటోన్నారు. తొలి రెండు రోజుల్లో రెండు లక్షల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ట్రావెన్కూర్ దేవస్వొం బోర్డు అధికారులు అంచనా వేశారు.
స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన ఏపీకి చెందిన బస్సు ప్రమాదానికి గురి కావడం కలకలం రేపింది. ఈ తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. పథనంథిట్ట జిల్లాలోని లాహా వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మంది భక్తులు గాయపడ్డారు. వారిని పెరునాడ్ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని పథనంథిట్ట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడ్డ వారిలో ఓ బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలుడిని కొట్టాయం వైద్య కళాశాల, ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
శబరిమల నుంచి తిరుగుముఖం పట్టిన బస్సు పథనంథిట్ట వైపు వస్తోన్న సమయంలో లాహా వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడింది. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. క్రేన్లను తెప్పించి బస్సును వెలికి తీశారు. అందులో ఇరుక్కున్న భక్తులను వెలికి తీయడానికి సుమారు మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. గాయపడ్డ వారంతా ఏలూరు మండలం మాదేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కేరళ అధికార యంత్రాంగాన్ని సంప్రదించాలని తన కార్యాలయం అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకోవాలని అన్నారు. గాయపడ్డ వారికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని చెప్పారు. పథనంథిట్ట జిల్లా, పోలీసు యంత్రాంగంతో మాట్లాడుతున్నామని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఆసుపత్రిలో చేరిన కొడాలి నాని - ఐసీయూలో చికిత్స