సీఎం ఆదేశంతో ఒక్క రోజులో ఎన్టీఆర్ ఊరుకు బస్సు సౌకర్యం
విజయవాడ:కృష్ణాజిల్లాలో ని ఓ గ్రామానికి హఠాత్తగా ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఇందులో అంత విశేషం ఏముంది అంటారా?...ఆ వూరు తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు స్వగ్రామం కావడమే విశేషం.
ఎన్టీఆర్ జన్మించిన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు నేటి నుంచే ప్రారంభమైంది. విజయవాడ పీఎన్బీఎస్ సిటీ బస్టాండ్ నుంచి ఈ కొత్త బస్సు సర్వీసుకు ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య ఈరోజే జెండా ఊపి ప్రారంభించారు. అయితే దీనివెనుక కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేమిటంటే... ఇప్పటివరకు నిమ్మకూరుకు విజయవాడ నుంచి నేరుగా బస్సు సర్వీసు లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో ఎన్టీఆర్ స్వగ్రామ వాసులు అంటే నిమ్మకూరు వాసులు విజయవాడకు వచ్చి పోయేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఇటీవల జరిగిన మహానాడులో ఆ గ్రామస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి ఈ విషయం తెచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన నిమ్మకూరుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం వెంటనే కల్పించాలని ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్యను ఆదేశించారు.
దీంతో దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఆగమేఘాల మీద పూర్తి కాగా కేవలం ఒక రోజు వ్యవధిలోనే నిమ్మకూరుకు కొత్త బస్సు సిద్ధమైంది. ఆ తరువాత విజయవాడ నుంచి తొలిసారిగా ప్రయాణికులతో నిమ్మకూరుకు పరుగులు పెట్టింది. ఇక నుంచి విజయవాడ నుంచి నిమ్మకూరుకు ప్రతి రోజూ ఆరు ట్రిప్పులు ఈ బస్సు రాకపోకలు కొనసాగిస్తుందని ఆర్టీసీ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.