విజయవాడలో రేపు బిజినెస్ లాక్డౌన్- వచ్చే వారం నుంచి వీకెండ్ బంద్
ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు లెక్కకుమిక్కిలిగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం వ్యాపార రాజధాని అయిన విజయవాడపైనా కనిపిస్తోంది. ఇప్పటికే పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పోలీసులు కోవిడ్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయిస్తున్నారు. ఉల్లంఘించే వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ కాపు కాస్తూ మాస్కులు ధరించని వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
విజయవాడలో పెరుగుతున్న కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా రేపు ఒక్క రోజు పూర్తిగా వ్యాపార సంస్ధలు, వాణిజ్య సముదాయాలు మూసివేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. కరోనా కేసుల పెరుగుదల దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు విజయవాడలో అన్ని వ్యాపార సంస్ధలు, షాపులు, రోడ్లపై వ్యాపారాలు కూడా రేపు మూతపడనున్నాయి. వారాంతం కావడంతో రేపు ఎక్కువమంది రోడ్లపైకి రావొచ్చన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడలో ఎల్లుండి నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యాపారాల్ని పరిమితం చేయాలని కూడా నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల తర్వాత వ్యాపార సంస్ధలు, షాపులు కూడా మూతపడబోతున్నాయి. గతేడాది కరోనా వైరస్ తీవ్రత సమయంలో ఇలా చేసేవారు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్ధితులు ఎదురవుతున్న నేపథ్యంలో వ్యాపార వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అలాగే వచ్చే వారం నుంచి వారాతంలో అంటే శనివారం, ఆదివారం కూడా వ్యాపారాల్ని బంద్ చేయబోతున్నారు. వినియోగదారుల రద్దీ తగ్గించడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video