కారు టైర్ పంక్చర్: బెంగళూరులో రూ. 15 లక్షలు లూటీ, నెల్లూరు జిల్లావారి పనేనా?
బెంగళూరు: టైర్ పంక్చర్ చేసిన నిందితులు కారులో ఉన్న రూ. 15 లక్షలు లూటీ చేసి పరారైన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. పట్టపగలు అందరూ చూస్తున్న సమయంలో లక్షల రూపాయల నగదు దర్జాగా ఎత్తుకుని వెళ్లారు.
బెంగళూరు నగరంలోని గిరినగర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ సంఘటన జరిగింది. బెంగళూరులో నివాసం ఉంటున్న బాలయ్య వ్యాపారం చేస్తున్నాడు. ఈయన బుధవారం గిరినగరలోని సీతా సర్కిల్ లోని ఎస్ బీఐ బ్యాంకు దగ్గరకు వెళ్లారు.
బ్యాంకు సమీపంలో కారు పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. రూ. 15 లక్షలు డ్రా చేసుకుని బ్యాగ్ లో పెట్టుకున్నాడు. అప్పటికే బయట ఉన్న నిందితులు ఆయన కారు టైర్ పంచర్ చేశారు. బాలయ్య బయటకు వచ్చి కారులో నగదు ఉన్న బ్యాగ్ పెట్టారు.
ఆ సందర్బంలో సార్ మీ కారు టైర్ పంక్చర్ అయ్యిందని ఆయనకు చెప్పారు. బాలయ్య టైర్ పరిశీలిస్తున్న సమయంలో పల్సర్ బైక్ లో వచ్చిన నిందితులు కారు కిటికీలో నుంచి రూ. 15 లక్షలు ఉన్న బ్యాగ్ ఎత్తుకుని అక్కడి నుంచి దర్జాగా పరారైనారు.
ఆ సందర్బంలో గట్టిగా కేకలు వేసినా ఫలితం లేదని బాలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నిందితులు బెంగళూరు నగరంలో ఇలాంటి నేరాలు ఎక్కువ చేస్తున్నారని, గతంలో చాల మందిని ఇలాంటి కేసులలో అరెస్టు చేశామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.