బద్వేలు - హుజూరాబాద్ లో నేటితో ప్రచారానికి తెర : రెండు చోట్లా బీజేపీకి ప్రతిష్ఠాత్మకం..!!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలకు నేటితో ప్రచారం ముగియనుంది. ఏపీలోని కడప జిల్లా బద్వేలు..తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియెజకవ ర్గాలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. గతంలో 48 గంటల ముందు ప్రచారం నిలిపివేసారు. ఎన్నికల సంఘం తాజా నిబంధనల మేరకు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ నెల 30వ తేదీన రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనంది. ఈ రోజు ఏడు గంటలకు ప్రచారం ముగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
చివరి ప్రయత్నాల్లో పార్టీల కీలక నేతలు
నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. బద్వేలులో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో అక్కడ ఉప ఎన్నిక రాగా... తెలంగాణలోని హుజూరాబాద్ లో మాజీ మంత్రి..సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామాతో బై పోల్ వచ్చింది. ఇక, రెండు చోట్లె అధికార టీఆర్ఎస్ - వైసీపీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మరి కొన్ని గంటలే ప్రచారానికి సమయం ఉండడంతో.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.
కేసీఆర్ వర్సెస్ ఈటల..ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకమే
హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచార వేడి తారస్థాయికి చేరింది. ఈ ఉపఎన్నికలో గెల్చి, మరోసారి సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఈటల గెలుపుతో ఝలక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే, చాపకింద నీరులా హస్తం పార్టీ ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గం సింగాపురంలో హరీష్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సీఎం కేసీఆర్పై వ్యతిరేకత, ప్రజాసంగ్రామ యాత్రలో స్పష్టంగా కనిపించిందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికార పార్టీ డబ్బు,మద్యం పంచినా..గెలిచేది బీజేపీనేనన్నారు. వరేస్తే ఉరే అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను జిల్లా కలెక్టర్ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
ఈటల పట్టు నిలుపుకొనే ప్రయత్నాలు
హుజూరాబాద్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు బండి. మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నికపై బెట్టింగుల పర్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారానికి తెరపడనుండడంతో.. ఓటర్ను ఆకట్టుకునేందుకు ఆఖరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి తన ఇలాకా లో పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని ఈటల... టీఆర్ఎస్ గెలుపు కోసం కేసీఆర్ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ ప్రధాన పోటీ కారు వర్సెస్ కమలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక, ఏపీ లోని బద్వేలులో వైసీపీ-కాంగ్రెస్ -బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.
Recommended Video
తమకు మెజార్టీయే ముఖ్యమంటున్న వైసీపీ
అధికార వైసీపీ 2019 కంటే భారీ మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఇక్కడ మొత్తం గెలుపు బాధ్యతలను సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. మంత్రులు..ఎమ్మెల్యేలు ఈ బై పోల్ లో అత్యధిక మెజార్టీ సాధించటమే లక్ష్యంగా చివరి ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. బీజేపీ ముఖ్య నేతలు బద్వేలులో ప్రచారం చేసారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవటంతో..ప్రభుత్వ వ్యతిరేక - టీడీపీ అనుకూల ఓటు తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ ..కాంగ్రెస్ నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. బద్వేలు ఉప ఎన్నిక ఏకపక్షంగా తమకు విజయం దక్కుతుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో..ఈ సాయంత్రం ప్రచారం ముగిసిన తరువాత మంత్రులు..ఎమ్మెల్యేలు బద్వేలు వీడి వెళ్లిపోవాల్సి ఉంటుంది.