‘రేణుకా! ప్రాణమున్నంత వరకూ జగన్తోనే అని., ఇదేనా కృతజ్ఞత?’
అధినేతే చెప్పినా వినకుండా ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరుతుండటం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Recommended Video
కర్నూలు: అధినేతే చెప్పినా వినకుండా ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరుతుండటం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాణమున్నంత వరకూ అని..
సాధారణ మహిళగా ఉన్న బుట్టా రేణుకకు తమ పార్టీ కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే కనీస కృతజ్ఞత కూడా లేదని మండిపడ్డారు. ప్రాణం ఉన్నంతవరకూ జగన్ వెంటే నడుస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. తనపై వస్తున్న వార్తలతో బుట్టా రేణుక మనస్తాపం చెందినట్లు వెలువడ్డ వార్తలపై స్పందిస్తూ... గెలిచిన మూడో రోజే ఆమె భర్త పచ్చ కండువా కప్పుకున్నప్పుడు తామెంత మనస్తాపం చెంది ఉంటామో గుర్తించాలన్నారు.
చంద్రబాబుతో రహస్యంగా ఎందుకు?
రహస్యంగా వెళ్లి సీఎం చంద్రబాబును కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని రామయ్య ప్రశ్నించారు. అంతేగాక, ఫిరాయింపుదారులకు టీడీపీలో ఎలాంటి గౌరవం దక్కుతోందో తెలుసుకోవాలని బుట్టా రేణుకకు బీవై రామయ్య సూచించారు. అక్కడ కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా వారికి మర్యాద ఇవ్వడంలేదన్న విషయాన్ని గమనించాలన్నారు.
తగిన బుద్ధి చెబుతారు..
ఫిరాయింపుదారులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బుట్టా రేణుకనుద్దేశించి హెచ్చరించారు. తమ పార్టీలో ప్రజాదరణ కలిగిన నాయకులకు కొదవలేదన్న విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీవై రామయ్య సూచించారు. మూడున్నరేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి ఏమాత్రం జరగ లేదన్నారు.
పశువుల మాదిరి కొనుగోళ్లు.. జగన్ యాత్రతో గుండెళ్లో రైళ్లు
విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను మభ్యపెట్టి సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేపట్టనున్న పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని బీవై అన్నారు.