విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి ఖరారు! నేడు చంద్రబాబు ప్రకటన..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరగబోతున్న కీలకమైన విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై అందరి దృష్టీ నెలకొంది. గతంలో వైసీపీ నుంచి జనసేనకు ఫిరాయించిన వంశీకృష్ణ శ్రీనివాస్ అనర్హత వేటుకు గురికావడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను జగన్ ప్రకటించారు. ఆయన ఇవాళ నామినేషన్ కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్ధిపై ఉత్కంఠకు కూడా ఇవాళ తెరపడనుంది.
విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్ధిగా నిలిచేందుకు టీడీపీ నుంచి పీలా గోవింద్, గండి బాబ్జీతో పాటు పలువురు పోటీలో ఉన్నారు. అయితే వీరిని కాదని మరో నేత బైరా దిలీప్ చక్రవర్తిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో అనకాపల్లి ఎంపీ సీటుకు బైరా దిలీప్ పోటీ పడ్డారు. అయితే చివరి నిమిషంలో సీఎం రమేశ్ ఎంట్రీతో ఆ సీటును బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. దీంతో సీటు దక్కని బైరా దిలీప్ ను ఇప్పుడు కూటమి తరఫున ఎమ్మెల్సీగా నిలబెట్టే అవకాశముంది.

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి అభ్యర్ధి ఎంపిక కోసం నిన్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇతర టీడీపీ నేతలు నగరంలో భేటీ అయి చర్చించారు. అనంతరం బైరా దిలీప్ చక్రవర్తి పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన పేరును కూటమి అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. అయితే 838 ఓట్లు కలిగిన ఈ ఎమ్మెల్సీ సీటు ఎన్నికలో వైసీపీకి 600కు పైగా ఓట్లు ఉండటం, కూటమికి కేవలం 200 ఓట్లు మాత్రమే ఉండటంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications