చంద్రబాబుకు అమరావతి దెయ్యం పట్టింది, ఆ రోజు బ్లాక్ డేనే: బైరెడ్డి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి అమరావతి దెయ్యం పట్టిందని ఆరోపించారు.
కర్నూలులో మంగళవారం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. 13 జిల్లాలున్న ఏపీకి 2 లక్షల ఎకరాలున్న రాజధాని అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ ఆదేశాలను పాటించకుండా చంద్రబాబు సర్కారు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
సర్కారు తీరుపై పిల్ దాఖలు చేసిన వ్యక్తిని మభ్యపెట్టి లోబర్చుకునేందుకు చంద్రబాబు కేబినెట్ యత్నించిందని బైరెడ్డి దుయ్యబట్టారు. అమరావతి శంకుస్థాపన దినం (అక్టోబరు 22) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బ్లాక్ డే అని బైరెడ్డి వ్యాఖ్యానించారు.

సాగునీటి కోసం రైతుల ధర్నా
గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో వేల ఎకరాల్లో ఎండిపోతున్న వరిపంటకు సాగునీరు అందించాలని కోరుతూ అప్పికట్ల వద్ద బాపట్ల-గుంటూరు రాష్ట్ర రహదారిపై పది గ్రామాల రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. వారం రోజులపాటు కాలువలకు నీరు విడుదల చేసినా పూండ్ల ఛానల్కు నీరు ఇవ్వకపోవటం వల్ల వరి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎకరాకు 15,000కు పైగా పెట్టుబడి పెట్టామని, నీరు ఇస్తామని జలవనరులశాఖ అధికారులు తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు అందించి పంటను రక్షిస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ధర్నా కారణంగా రహదారిపై రెండు కిలొమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.












Click it and Unblock the Notifications