'మమతా బెనర్జీకే ప్రాణభయం లేదు, చంద్రబాబుకు భయమెందుకో చెప్పాలి'
అమరావతి: నిత్యం కేంద్రంపై పోరాడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రాణభయం లేకుండా హాయిగా ఉన్నారని, అలాంటిది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రాణభయం ఉందని చెప్పడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య శుక్రవారం మండిపడ్డారు.
రాష్ట్రాన్ని కాపాడే ముఖ్యమంత్రే ఇలా భయపడుతుంటే ప్రజలను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఆయన చేసిన అక్రమాలే ముప్పు తెస్తాయన్నారు. ఆయనను గెలిపించడమే పాపం అయిపోయిందన్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?
కానీ చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? ఏ విషయంలో భయపడుతున్నారు? ప్రజలను ఎలా కాపాడగలుగుతారు? అనే విషయాలకు సమాధానం చెప్పవలసి ఉందని రామచంద్రయ్య అన్నారు. సీఎంగా ఉండి, సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అంటే ఆయన మాటలు సానుభూతి కోసమా? లేక అందులో నిజముందా? అన్నారు.

ఎవరి సానుభూతి కోసం?
భయపడుతున్నామని చెప్పడంపై.. ఎవరి సానుభూతి కోసం మాట్లాడుతున్నారో లేక ఏ రాజకీయ ఎత్తుగడ ఉందో చెప్పాలని సీ రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు సీఎం అని, ఏదో ఒకటి చెప్పి తుడుచుకొని వెళ్దామంటే కుదరదన్నారు. మీ భయం ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. హోంమినిస్టర్, డీజీపీని చెప్పమని సూచించాలన్నారు. మీరు ఏం అక్రమాలు చేశారు.. ఎవరు కసి పెంచుకున్నారని ప్రశ్నించారు.

నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు
నిజంగా చంద్రబాబు తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదని రామచంద్రయ్య అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఇచ్చిన హామీలు చంద్రబాబుకు గుర్తుకు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని యూటర్న్లు తీసుకుంటారో చెప్పాలన్నారు.

ఇంకెన్ని యూటర్న్లు
హోదాకు బదులు ప్యాకేజీని స్వాగతించి, ఇప్పుడు ధర్మపోరాటం అనడం విడ్డూరమన్నారు. చంద్రబాబుకు జాతీయస్థాయిలో ఒకప్పుడు గుర్తింపు ఉండేదని, ఇప్పుడు లాఫింగ్ స్టార్ అయ్యారని ఎద్దేవా చేశారు. గవర్నర్ వ్యవస్థపై చంద్రబాబు స్టాండ్ చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications