ముప్పేట దాడి.. విద్యార్థి దశ నుంచే చంద్రబాబుది కుల రాజకీయం: సిఆర్
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ నేతలు సి రామచంద్రయ్య, శైలజానాథ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మలు వేర్వేరుగా తీవ్రంగా దుమ్మెత్తి పోశారు.
చంద్రబాబు కులతత్వాన్ని పెంచి పోషిస్తున్నారని సీ రామచంద్రయ్య ధ్వజమెత్తారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబువి కుల రాజకీయాలు అని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ, అధికారిక నియామకాలన్నీ కుల ఆధారమైనవేని ఆరోపించారు.
తుని ఘటనకు ఏం సంబంధం: శైలజానాథ్
తుని ఘటనకు రాయలసీమకు ఏం సంబంధమని శైలజానాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలు రాయలసీమవాసులను కించపరిచేలా ఉన్నాయన్నారు. కాపులు తర్వాత రైతులు, యువత రోడ్డెక్కే పరిస్థితి ఉందని చెప్పారు. జనాభా నిష్పత్తిలో ఆదాయ వనరులు పంచాలన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై అణగారిన వర్గాలు ఆలోచించాలన్నారు.
దళితులపై మానసిక దాడి: వాసిరెడ్డి పద్మ
చంద్రబాబు దళితుల పైన మానసిక దాడికి పాల్పడ్డారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. దళితులకు చంద్రబాబు హుందాగా క్షమాపణ చెబితే బాగుండేదని ఆమె అన్నారు.
విశాఖ రాలేవే జోన్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలం
ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత తెలిపింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి రైల్వేశాఖకు ఆదేశాలు వెళ్లాయి. ఆ వెంటనే రైల్వే జోన్ పై చర్చించేందుకు రైల్వేశాఖ సాంకేతిక కమిటీ సమావేశమైంది. మిట్టల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జోన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
వచ్చే మంత్రివర్గ సమావేశానికి రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వనున్నారు. తాజా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. మరునాడే కేంద్రం సుముఖత వ్యక్తం చేయడం విశేషం. దాంతో పాటు కాకినాట-కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ కు కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. అంతర్వేది డ్రెజ్జింగ్ హార్బర్ కు అనుసంధానించేలా ఈ రైల్వేలైన్ ఉంటుంది.