అక్కడ ఫైబర్ నెట్ కట్ చేశారు...లోకేష్ చాలా సీరియస్ అయ్యారు...
అమరావతి: డిజిటల్ టెక్నాలజీ రంగంలో ఎపి ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెడుతున్నసరికొత్త సిస్టమ్ ఫైబర్ గ్రిడ్. అయితే ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థ కు జనాదరణ ఎలా ఉంటుందనే అంశాన్ని పక్కన బెడితే ఇప్పటికే ఉన్న కేబుల్ ఆపరేటర్లు ఈ సిస్టమ్ ను ఎంతవరకు స్వాగతిస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల ఫైబర్ నెట్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు మంత్రి లోకేష్ ఈ సంఘటనపై చాలా సీరియస్ అయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 6 చోట్ల ఫైబర్ నెట్ కేబుల్ను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కట్ చేశారు. రాష్ట్రపతి పర్యటన కార్యక్రమం ప్రసారం కాకుండానే వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు.
దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రాను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తి అయిన ఫైబర్ కేబుల్ని కట్ చేయడం చట్టరీత్యా నేరమని లోకేష్ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను తక్కువ ధరకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే కొంత మంది వ్యక్తులు కుట్రపూరితంగా దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.