మోడీ దిగొచ్చారా: చంద్రబాబు ప్రధాని ఆఫీస్ నుంచి ఫోన్?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లకు తలొగ్గి ప్రధాని నరేంద్ర మోడీ దిగి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని కార్యాలయం నుంచి శుక్రవారం చంద్రబాబు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని అనుకుంటున్నారని, ప్రధాని స్థాయియలో ప్రారంభించాల్సిన గానీ శంకుస్థాపనలు చేయాల్సిన గానీ పనులేమైనా ఉన్నాయా అని పిఎంవో కార్యాలయం ఆరా తీసినట్లు చెబుతున్నారు
వేడిని చల్లార్చే విధంగా వస్తారా..
రాష్ట్ర ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రధాని ఏవైనా ప్రతిపాదనలతో వస్తారా అనే ఆలోచన కలుగుతోంది. పర్యటనలో వాటిని ప్రకటిస్తారా అని కూడా ఆలోచిస్తున్నారు. ప్రధాని పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యేలోగా వస్తారా, సమావేశాలు ముగిసిన తర్వాత వస్తారా అనేది తెలియడం లేదు. అయితే, మార్చి 5 తేదీ లోపే వచ్చే అవకాశాలున్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ రాసింది.
ప్రధాని ఏమిస్తారో తెలిస్తేనే...
రాష్ట్రానికి వస్తే ప్రధాని ఏమిస్తారో తెలిస్తేనే అందుకు తగిన కార్యక్రమాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి శంకుస్థాపన సమయంలో మట్టి, నీళ్లు మాత్రమే తెచ్చి ప్రధాని తీవ్ర నిరాశకు గురి చేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రానికి వచ్చి, ఏమీ ప్రకటించకుండా వెళ్లిపోతే ఫలితం ఉండదని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
స్పష్టత రావాలని చంద్రబాబు
ప్రధాని రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దుతారు, ఎంత సహాయం చేస్తారు, ఎలా... ఎప్పుడు వస్తారు అనే విషయాలపై స్పష్టత తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఆ తర్వాతే అధికారంగా మోడీకి ఆహ్వానం పంపాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
21వ తేదీన కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధాని కార్యాలయంలో (పిఎంవో)లో ఈ నెల 21వ తేదీన కీలక భేటీ జరుగుతుందని అంటున్నారు. అన్ని వివరాలతో ఈ భేటీకి హాజరు కావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖ అధికారులను పిఎంవో ఆహ్వానించినట్లు తెలుస్తది. 21వ తేదీన రాష్ట్ర విభజన చట్టం అమలుపై షీలా బీడే కమిటీతో చర్చలు జరపడానికి ఎపి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది.
ఈ అంశాలపై చర్చలు జరిపే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలాగూ ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఆయనను కూడా సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఈఎపిల ద్వారా రావాల్సిన నిధులు రెవెన్యూ లోటు భర్తీ, పారిశ్రామిక రాయితీలు, రాష్ట్ర విభజన హామీలపై పిఎంవో అధికారులు చర్చించే అవకాశం ఉంది. ఈఎపిలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి స్పష్టత ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.