కాల్మనీ కేసు: సింగపూర్లో ఏ4 నిందితుడు సత్యానందం?
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సత్యానందం ఆచూకీ పోలీసులకు సైతం అంతుబట్టకుండా ఉంది. విజయవాడలో కాల్మనీ వ్యవహారంలో వెలుగులోకి రావడంతో ఎలక్ట్రికల్ డీఈగా పనిచేస్తున్న సత్యానందంను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
సస్పెన్షన్కు గురైనప్పటికీ నుంచి సత్యానందం కనిపించకుండా పోయారు. దీంతో విదేశాలకు పరారయ్యారా అనే కోణంలో బెజవాడ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిజానికి, కాల్మనీ కేసులో ఆయన పేరు బయటికి రాగానే పోలీసులు ఆయన పాస్పోర్టుని సీజ్ చేశారు.
అయితే అప్పటికే సత్యానందం సింగపూర్కు వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో విజయవాడ పోలీసులు ఒకటి రెండు రోజుల్లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కాల్మనీ పేరిట పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే చాలా మంది ఎక్కడ తమపై దాడులు చేస్తారేమోనని భయపడి చాలామంది వడ్డీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం. ఇళ్లకు తాళాలు వేసేసి మరీ బయట ప్రాంతాల్లో తలదాచుకునేందుకు సిద్ధమైపోయారు. దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు.
కాగా, కాల్మనీ పేరిట వేధింపులకు పాల్పడుతున్నవారిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చెబుతున్నా సిబ్బంది పట్టించుకోకుండా వ్యాపారులను స్టేషన్కు పిలిపించడం, విచారించడం, కాల్మనీ కేసులు పెడతామని బెదిరించడం వంటివి చేస్తున్నారు. ఇందుకోసం వేల రూపాయలు చేతులు మారుతున్నట్టు పోలీసు శాఖలోని కొంతమంది సిబ్బంది చెబుతున్నారు.