కాల్ మనీ రామకృష్ణ కథ: ఐదుగురితో పెళ్లి, మహిళపై లైంగిక వేధింపులు
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఫైనాన్షియర్ గుడివాడ రామకృష్ణ వ్యవహారాలు ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. ఆయన వ్యవహారాలకు సంబంధించి స్థానిక మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. పదవ తరగతి వరకు చదువుకున్న గుడివాడ రామకృష్ణ కొంత కాలం కిందటి వరకు వెలంపేటలో నివాసం ఉండేవాడు.
మీడియా కథనాల ప్రకారం - భార్య చనిపోవడంతో రామకృష్ణ మరో ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వారిని విశాఖపట్నంలోనూ సామర్లకోట, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో ఉంచినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పెదవాల్తేరులోని శ్రీనివాస అపార్టుమెంటులో నివాసం ఉంటున్నాడు.
రోజూవారీ ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ కొద్ది కాలంలో ఆర్థికంగా ఎదిగాడు. వడ్డీల వ్యాపారం చేస్తున్న క్రమంలోనే అరిలోవ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన స్నేహితురాలి కోసం ఆభరణాలను ఒక ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టింది. వారు నోటీసు ఇవ్వడంతో అప్పు కోసం రామకృష్ణను ఆశ్రయించింది. అతను ఆభరణాలను విడిపించి సగం తన వద్ద ఉంచుకున్నాడు.
ఆమె నెలవారీ వడ్డీ చెల్లిస్తున్నా ఆభరణాలు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలు పెట్టాడని ఆ మహిళ ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరో ఇద్దరు మహిళలు రామకృష్ణపై నాలుగో పట్టణం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
టిఫిన్ పార్లర్ పెట్టడానికి అప్పు తీసుకని, కొంత తీర్చిన తర్వాత కూడా తన కోరిక తీర్చాలంటూ రామకృష్ణ వేధించాడంటూ సీతమ్మధారకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యక్తిగత అవసరాల కోసం 50 వేల రూపాయలు అప్పు తీసుకుంటే తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మరో యువతి ఫిర్యాదు చేసింది.
ఎవిఎన్ కళాశాల రిటైర్డ్ ఆచార్యుడు భమిడిపాటి సాంబమూర్తి (90) పెదవాల్తేరులోని శ్రీనివాస అపార్టుమెంటులోని రెండో అంతస్తులో ఒక ఫ్లాటును కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఆర్థిక అవసరాల కోసం దాన్ని విక్రయించాలని అనుకున్నారు. దీంతో ఫ్లాట్పై కన్నేసిన రామకృష్ణ సాంబమూర్తిని కలిసి రూ.35 వేల రూపాయలకు ఫ్టాట్ను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాీడు.
అడ్వాన్సుగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు. తర్వాత తన బలగంతో అక్కడికి చేరుకుని వారిని ఖాళీ చేయించి ఆక్రమించుకున్నాడు. దీనిపై సాంబమూర్తి ఎన్నిసార్లు వేడుకున్నా డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతూ వచ్చాడు.
ఈ సంఘటనలపై కేసు నమోదైందని తెలియగాని రామకృష్ణ పరారయ్యాడు. పోలీసులు బుధవారం రాత్రి రామకృష్ణ నివాసంలో సోదాలు చేసి నాలుగు పెద్ద కత్తులు, 37 ఖాళీ చెక్కులు, 35 ప్రామిసరీ నోటలు, ఆస్తులకు సంబంధించిన ఏడు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 42 గ్రాముల బంగారం, మహీంద్రా వాహనం, బైక్ స్వాధీనం చేసుకున్నారు.