కాల్ మనీ షాక్, రంగంలోకి ఫ్యామిలీ: సినీ డిస్ట్రిబ్యూటర్ వద్ద రోజుకు రూ.5లక్షల వడ్డీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఎన్నో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాల్ మనీ నిర్వాహకులు ఓ సినీ డిస్ట్రిబ్యూటర్కు పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చి, అతని నుంచి భారీగా వడ్డీ వసూలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
బాధిత డిస్ట్రిబ్యూటర్ పేరు వినోద్గా తెలుస్తోంది. కాల్ మనీ నుంచి అతను రూ.2.5 కోట్లు తీసుకున్నారు. దానికి గాను అతను రోజుకు రూ.5 లక్షల వడ్డీని చెల్లిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాల్ మనీ నిర్వాహకులు పరారీలో ఉండటంతో వారి కుటుంబ సభ్యులు వసూళ్ల కోసం రోడ్డెక్కారని తెలుస్తోంది.
'కాల్మనీ కీచకుల్ని శిక్షించండి'
కాల్మనీ కీచకుల్ని ప్రభుత్వం రక్షిస్తోందని, నిందితులను అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలని కాల్మనీ వ్యతిరేక పోరాట కమిటీ విజయవాడలో సోమవారం కోరింది. రాఘవయ్య పార్కు కూడలిలో కాల్మనీ కీచకుల్ని శిక్షించాలని కోరుతూ రాస్తారోకో చేశారు.
ఐద్వా, ప్రగతిశీల మహిళాసంఘం, మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో కాల్ మనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాల్ మనీ సంఘటన వెలుగుచూసి పదిహేను రోజులైనా ఇప్పటికీ అసలైన నిందితులను అరెస్టు చేయలేదన్నారు. ఆడవాళ్లను హింసించి, అత్యాచారం చేసిన కీచకులను వదిలిపెట్టవద్దని కోరారు.
అధిక వడ్డీలతో వేధించడమే కాకుండా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తోన్న కాల్ మనీ వ్యాపారులపై నిర్భయ చట్టాన్ని ప్రయోగించాలని విశాఖలో ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఏడు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి.