నరికేయండి!: నెహ్రూ, పార్థసారథి తీవ్ర ఆగ్రహం, కాల్ మనీపై బాధితుల్లో మంత్రి?
విజయవాడ: సంచలనం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ ఆదివారం నాడు స్పందించారు. కాల్ మనీ వ్యవహారాన్ని ప్రభుత్వం అరికట్టాలన్నారు. వ్యాపారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాల్ మనీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తక్షణం సస్పెండ్ చేయాలని దేవినేని నెహ్రూ ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈనాడు దినపత్రికలో.. 'నాయకులూ కాలాంతకులు' అంటూ ప్రచురితమైన కథనాన్ని చూపుతూ, దేవినేని నెహ్రూ టీడీపీపై మండిపడ్డారు. టిడిపి నేతలు ఈ దారుణం వెనుక ఉన్నారనేందుకు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలన్నారు. ఇందులో ప్రమేయమున్న వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు.

అందర్నీ నరికేయాలన్నారు. అదే సమయంలో... నరికేయడమంటే తన భాషను తప్పుగా అర్ధం చేసుకోవద్దని, ఈ వ్యాపారాన్ని సమూలంగా నిర్మూలించాలన్నది తన అభిమతమన్నారు. సీఎం చంద్రబాబు స్పందించకుంటే తీవ్ర ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు.
తాను ఇరవై అయిదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేసినా, ఎన్నడూ వారానికి ఓసారి విదేశాలకు వెళ్లలేదని, కానీ నేడు టిడిపి ఎమ్మెల్యేలు పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నారన్నారు. వారు నిందితులను వేసుకుని వెళుతున్నారని ఆరోపించారు.
మరోవైపు, స్వర్ణ బార్లోని జరిగిన కల్తీ మద్యం విషయమై కూడా దేవినేని నెహ్రూ స్పందించారు. తమ పార్టీ నేత మల్లాది విష్ణు పైన అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
వైసిపి సవాల్
కాల్ మనీ కేసులో నిందితుల పేర్లను బయటపెట్టాలని వైఎస్సార్ కాంగ్రగెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పార్థసారధి డిమాండ్ చేశారు. నీతి, నిజాయితీలు రక్తంలో ఉన్నాయని చెప్పుకునే చంద్రబాబు.. ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదన్నారు. దీనిపై విచారణ జరిపించాలన్నారు.
నిందితుడితో విదేశీ పర్యటనలకు తీసుకెళ్లిన టిడిపి ఎమ్మెల్యేను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు. కాల్ మనీ నిర్వాహకులను ఎన్కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని వడ్డీ మాఫియా చేతుల్లో చిక్కుకుపోయిందని, ప్రభుత్వం కళ్లు మూసుకుపోయిందని, చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జోలికి వెళ్లడం లేదని ఆరోపించారు.
కాల్ మనీ బాధితుల్లో మంత్రి!
కాల్ మనీ బాధితుల్లో ఓ మంత్రి కూడా ఉన్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో సదరు మంత్రి రూ.2 కోట్ల రూపాయలను కాల్ మనీ వారి నుంచి అప్పుగా తీసుకున్నారని ప్రచారం సాగుతోంది.
అయితే, ఇది నిజమేనా? నిజమైతే ఎవరు? అనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా, కాల్ మనీ కేసులో ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు యలమంచిలి రాము తదితరుల పైన నిర్భయ కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications