కాల్ మనీలో బండారం బయటపడుతుందనే: జగన్, బాధపడిన బాబు
హైదరాబాద్: కాల్ మనీ పైన సభలో చర్చ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు పాపం, బండారం బయటపడుతుందనే జరగనివ్వడం వైయస్ జగన్ శుక్రవారం ఆరోపించారు. శాసన సభ నుంచి సస్పెండైన అనంతరం ఆయన అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యేలతో కలిసి నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిందితులు చంద్రబాబుతో ఫోటో దిగారని చెప్పారు. ఇంటెలిజెన్స్ డిజితోను ఫోటోలు దిగారన్నారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్పై చర్చను అడ్డుకునేందుకే చంద్రబాబుకు ఇప్పుడు అంబేడ్కర్ గుర్తుకు వచ్చాడన్నారు.
ఓసారి అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని చూడాలని, దుమ్ము పట్టిందని, దానిని కనీసం శుభ్రం చేయించే విషయం చంద్రబాబుకు గుర్తుకు రాలేదన్నారు. అంబేడ్కర్ వర్ధంతి, జయంతి రోజున చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు.
ఇప్పుడు కాల్ మనీ కోసమే గుర్తుకు వచ్చారన్నారు. బిఏసీలో అంబేడ్కర్ పైన చర్చ అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదన్నారు. టిడిపి ఎమ్మెల్యేతో కాల్ మనీ నిందితుడు శ్రీకాంత్ విదేశాలకు వెళ్తే, ఆ ఎమ్మెల్యేను పోలీసులు విచారించలేదన్నారు. రాజకీయాల కోసం టిడిపి అంబేడ్కర్ పేరును వాడుకుంటోందన్నారు.
ఇంత దారుణమైన పాలన ఎక్కడా లేదన్నారు. కాల్ మనీ బాధితులు పేదవాళ్లు కాదా, అంబేడ్కర్ బిడ్డలు కాదా అని ప్రశ్నించారు. నిన్న బిఏసీ అజెండాలో అంబేడ్కర్ అంశమే లేదని, మొదటిసారి వాయిదా పడిన అనంతరం అంబేడ్కర్ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. కాల్ మనీ నిందితులు మహిళలను బెదిరించి, అసభ్యంగా వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధేస్తోంది: చంద్రబాబు
కలుషిత రాజకీయాలు చూస్తుంటే బాధ వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసన సభలో అన్నారు. అంబేడ్కర్ పైన చర్చ సమయంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ పైన చర్చను అడ్డుకున్నవైసిపి పైన ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంబేడ్కర్కు ప్రపంచం మొత్తం హేట్సప్ చెప్పిందన్నారు.
అంబేడ్కర్ పైన చర్చకు బిఏసీలో అంగీకరించిన వారు ఆ తర్వాత సభలోకి వచ్చాక వైసిపి సభ్యులు వ్యతిరేకించారన్నారు. అంబేడ్కర్ పైన చర్చ పూర్తయ్యాక కాల్ మనీ పైన చర్చిద్దామని చెప్పామన్నారు. అంబేడ్కర్ పైన పార్లమెంటులో రాజకీయ పార్టీలు అన్నీ చర్చించాయని చెప్పారు.
అంబేడ్కర్ పైన చర్చను అడ్డుకోవడం చాలా దారుణమన్నారు. రాజ్యాంగం పైన గౌరవ ప్రపత్తులతో అంబేడ్కర్ పైన చర్చ చేపట్టామన్నారు. రాజ్యాంగంపై, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పైన చర్చ చారిత్రాత్మకం అన్నారు. రాజ్యాంగ సౌధానికి ప్రాణప్రతిష్ట చేసిన అంబేడ్కర్ను స్మరించుకోవడం చారిత్రాత్మకం అన్నారు.