కాల్ మనీలో పార్టీల వారే: పోలీసులు, బాబువల్లే పదేళ్ల దారుణం వెలుగులోకి.. జగన్కు కౌంటర్
విజయవాడ/హైదరాబాద్: కాల్ మనీలో అత్యధిక వ్యాపారులు రాజకీయ పక్షాల వారేనని ఏపీ పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారుల్లో రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న నాయకులే అధికంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వడ్డీవ్యాపారుల పైమ జరుపుతున్న దాడుల్లో వైసిపి, తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐలకు చెందిన వారు పట్టుబడ్డారన్నారు. విజయవాడలో కాల్ మనీ వ్యవహారం నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పోలీసులు సోదాలు జరుపుతున్నారు.
మనీ లాండరింగ్ చట్టంతో పాటు, బెదిరింపులు, మోసం, ఆస్తుల దురాక్రమణ, మహిళలతో అసభ్యప్రవర్తన తదితర అభియోగాల కింద ఆయా నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న వడ్డీ వ్యాపారుల పైన కేసులు నమోదు చేస్తున్నారు.

అదుపులోకి తీసుకున్న 118 మందిలో... 83 మంది వివిధ రాజకీయ పక్షాలతో అనుబంధంగా ఉన్నవారేనని పోలీసులు తెలిపారు. వీరిలో టిడిపితో అనుబంధం ఉన్నవారు 20 మంది, వైసిపితో అనుబంధం ఉన్నవారు 44 మంది, కాంగ్రెస్తో అనుబంధం ఉన్నవారు 13 మంది, సీపీఐతో అనుబంధం ఉన్నవారు ఆరుగురు ఉన్నట్లు తెలిపారు.
కాల్ మనీ పై ఫిర్యాదు నేపథ్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏపీ సీఎస్, డిజిపిలకు వివరణ కోరుతూ నోటీసులు పంపింది.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాల్లో కాల్ మనీ వ్యవహారం ప్రధాన అంశంగా మారనుంది. ఇప్పటికే కాల్ మనీ - సెక్స్ రాకెట్ పైన వైసిపి తీర్మానం ఇచ్చింది. రుణాల ముసుగులో మహిళలను లైంగికంగా లోబరుచుకోవడం, అత్యాచారాల రూపంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై తీర్మానం ఇచ్చారు.
కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని విపక్షం చూస్తోంది. అధికార పక్ష నేతలో ఈ వ్యవహారంలో ఉన్నారని నిలదీసేందుకు వైసిపి సిద్ధమైంది. అయితే కాల్ మనీ కొత్తది కాదని, దశాబ్ద కాలంగాఉందని, చంద్రబాబు అధికారంలోకి రావడం వల్లనే వెలుగు చూసిందని, ఇందులో తమ పార్టీ వారిని కూడా వదల్లేదని చెప్పేందుకు అధికార పార్టీ సన్నద్ధమైంది.












Click it and Unblock the Notifications