కాల్ మనీ ఎఫెక్ట్: లీవ్ రద్దు చేసుకున్న సవాంగ్, జనసేన పార్టీ ఆందోళన
హైదరాబాద్/విజయవాడ: కాల్ మనీ వ్యవహారం తీవ్రత దృష్ట్యా సెలవు రద్దు చేయాలని తాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) జేవీ రాముడిని కోరానని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ బుధవారం నాడు తెలిపారు.
తొలుత ఆయన ఈ నెల 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు నెల రోజుల క్రితం సెలవు తీసుకున్నారు. కాల్ మనీ ప్రకంపనల నేపథ్యంలో తన సెలవును రద్దు చేసుకుంటున్నట్లు ఈ రోజు తెలిపారు.
కేసు తీవ్రత దృష్ట్యా తాను సెలవుల పైన వెళ్లడం లేదని చెప్పారు. సెలవులు రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. కాల్ మనీ వ్యవహారం నేపథ్యంలో సెలవు రద్దు చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసు పూర్తయ్యాకనే తాను విదేశాలకు వెళ్తానని ఆయన అభిప్రాయపడ్డారు.

నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయండి: ఎస్పీ రవిప్రకాశ్
కాల్ మనీ బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. ఫైనాన్స్ వ్యాపారుల పైన తాము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బెజవాడలో కేబినెట్ భేటీ, హైదరాబాదులో వైసిపి శాసన సభా పక్ష సమావేశం
రేపటి నుంచి (గురువారం) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బెజవాడలో ఏపీ కేబినెట్, హైదరాబాదులో వైసిపి శాసన సభా పక్ష నేతలు భేటీ అయ్యారు. ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా కాల్ మనీ వ్యవహారంపై చర్చ జరగనుంది. కాల్ మనీ, బాక్సైట్ తవ్వకాలు అంశంపై వైసిపి చర్చించనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు.

బెజవాడలో జనసేన జెండాలతో ధర్నా
కాల్ మనీ వ్యవహారంపై జనసేన పార్టీ ధర్నా చేపట్టింది! కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఆ పార్టీ జెండాలతో కొందరు నిరసన వ్యక్తం చేశారు. కాల్ మనీ వ్యవహారంలో మహిళలను వేధిస్తున్న వ్యాపారులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. కాల్ మనీ నిర్వాహకులను ఎన్కౌంటర్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications