కాల్ మనీ: గెస్ట్ హౌస్కు వచ్చి కోరిక తీర్చకుంటే బ్రోతల్ కేసు పెడ్తామని బెదిరింపు
విజయవాడ: తాను 'కాల్ మనీ' నిర్వాహకుల వద్ద రూ.24 లక్షలు తీసుకొని, రూ.41 లక్షలు చెల్లించానని.. అయినా వారు తనను వదలలేదని, తన తోటలకు చెందిన కాగితాలను వారి వద్ద పెట్టుకున్నారని, గెస్ట్ హౌస్కు రావాలని, కోరిక తీర్చితే ఇస్తామని బెదిరించారని ఓ మహిళ వాపోతున్నారు.
బెజవాడలో కాల్ మనీ దందా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. వందలాది మంది బాధితులు పోలీసులకు ఇప్పుడు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అధిక వడ్డీకీ ఇష్టారీతిన డబ్బులు తీసుకున్నారని, తమ భూములను వారి పేర రాయించున్నారని, మహిళలను కోరిక తీర్చమని వేధిస్తున్నారని చెబుతున్నారు.
తాజాగా, ఓ మహిళ తన ఆవేదనను వెళ్లగక్కారు. కాల్ మనీ వ్యవహారంలో ఎవరినీ ఆశ్రయించినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేకూరు శ్రీను, సూరపనేని శ్రీధర్ అనే ఇద్దరు అవసరం నిమిత్తం తనకు రూ.24 లక్షలు ఇచ్చారని, రూ.41 లక్షలు తీసుకున్నారని చెప్పారు.
తన మామిడి, జామ తోటల పత్రాలను వారి వద్దే ఉంచుకున్నారన్నారు. మామిడి తోటను చేకూరి శ్రీను తన మరదలి పేరిట రాయించుకున్నారని చెప్పారు. తన జామ తోట కాగితాలు వారి వద్దే పెట్టుకున్నారన్నారు. తాను ఉంటున్న చోటుకు వచ్చి తనను ఇష్టారీతిన తిట్టారన్నారు.
తనను గెస్ట్ హౌస్కు రావాలని హెచ్చరించారని, రాకుంటే ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించానని, ఈ విషయమై ఓ ఎమ్మెల్యేను కూడా కలిసి విన్నవించానని చెప్పారు. వారి వేధింపులు తాళలేక.. ఆత్మహత్యాయత్నం చేశానని, ఆసుపత్రికి వచ్చి కూడా వేధించారన్నారు.
మేం చెప్పినట్లు గెస్ట్ హౌస్కు వచ్చి కోరిక తీర్చితే నావి నాకు ఇస్తామని చెప్పారని, లేదంటే బ్రోతల్ కేసు కింద కేసు పెడతామని బెదిరించారన్నారు. ఇప్పుడు కాల్ మనీ వ్యవహారం బయటకు రావడంతో ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు.