కాల్మనీ కేసు: బాధిత మహిళలకు వణుకు, ఎవరీ భవానీ శంకర్?
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న బౌన్సర్ భవానీ శంకర్ పేరు వింటే బాధిత మహిళలు వణికిపోయేవారని తెలుస్తోంది. సెల్ ఫోన్ ఆధారంగా భవానీ శంకర్ను టాస్క్ఫోర్స్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
అసలు ఇంతకీ ఎవరీ భవానీ శంకర్. కాల్మనీ కేసులో ఏ1 నిందితుడిగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము వద్ద బౌన్సర్స్కు పెద్దగా వ్యవహారిస్తుంటాడు. యలమంచిలి రాము వద్ద అప్పు తీసుకుని వడ్డీ సకాలంలో చెల్లించలేకపోయిన ఖాతాల జాబితాను ఇతడు డీల్ చేస్తుంటాడు.
అంతేకాదు వడ్డీ చెల్లించకపోతే వారి ఇళ్లకు వెళ్లడం, ఇంట్లో ఉండే మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం లాంటి చేస్తుంటాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వారిని పలు రకాలుగా సెల్ ఫోన్లో ఫోటోలు తీసి వాటిని ఇంటర్నెట్లో మార్ఫింగ్ చేసి వారికి తిరిగి మెయిల్ చేయడం మొదలైన పనులు చేయడం విధి.
అంతటితో ఆగకుండా అప్పు తీసుకుని చెల్లించ లేని స్థితిలో ఉన్న మహిళలను వారి కార్యాలయానికి పిలిపించి వారికి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి వారితో శారీరక వాంఛలు తీర్చుకోవడం చేస్తుంటాడు. ఈ సమయంలో తీసిన వీడియోలను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడంలో భవానీ శంకర్దే ప్రధాన పాత్ర అని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది.
దీంతో భవానీ శంకర్ను కాల్ మనీ కేసులో ఏ2 నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులు 35 వీడియోలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కాల్ మనీ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారంతా ఒక బృందంగా ఏర్పడి భవానీ శంకర్కు హీరో పాత్ర ఇచ్చి బాడీ బిల్డర్ అనే సినిమా కూడా తీస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇదే సమయంలో కాల్మనీ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేయడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో ఓ ఇంట్లో దాచి ఉంచిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఈ కాల్మనీ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన మహిళ డాక్యుమెంట్లు కూడా దాచి ఉంచిన వాటిలో లభించడంతో పోలీసులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో యలమంచిలి రాము, భవానీ శంకర్, చెన్నుపాటి నివాస్, విద్యుత్ శాఖ డీఈ సత్యానంద్, టీడీపీ నేతలు వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్పై కేసులు నమోదయ్యాయి.
వీరిపై ఐపీసీ సెక్షన్ 420, 376, 354a(1)(2), 384, 506, రెడ్విత్ 34, 120(బీ) కింద విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.