డెడ్ బాడీ నుంచి ఇతరులకు కరోనా సోకుతుందా..? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు...
కరోనా వైరస్ చుట్టూ ప్రజల్లో అనేక అపోహలు,అనుమానాలు నెలకొన్నాయి. సరైన అవగాహన లేని కారణంగా కరోనా పేషెంట్ల పట్ల వివక్ష చూపించడం,కరోనా పేషెంట్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సైతం ముందుకు రాకపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అయినవాళ్లు ఉన్నా అనాథ శవాల్లా అంత్యక్రియలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల మున్సిపల్ సిబ్బంది సైతం కరోనా పేషెంట్ల అంత్యక్రియలకు వెనుకంజ వేస్తున్న ఘటనలు కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పేషెంట్ల మృతదేహాలకు సంబంధించిన అపోహలు వీడాల్సిన అవసరం కనిపిస్తోంది.
Lockdown: సూపర్ స్టార్ కు కరోనా బంధువా ? ఫామ్ హౌస్ లో ఎంజాయ్, ఈ -పాస్ ఎలా ఇచ్చారు ? విచారణ !
అవి చేయవద్దు...
కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ కరోనా పేషెంట్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. సాంప్రదాయాల ప్రకారం మృతదేహాలకు స్నానం చేయించడం,హత్తుకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలంటున్నారు. పీపీఈ కిట్లు, చేతులకు గ్లౌజులు ధరించాలని... ప్రభుత్వం సూచించిన సంఖ్య మేరకు తగినంత మంది మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనాలని చెబుతున్నారు.
డెడ్ బాడీ నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందా?
కరోనా పేషెంట్ మృతదేహం నుంచి వైరస్ వ్యాప్తికి అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. రోగి మృతి చెందిన 6గం. తర్వాత శరీరంలో ఎలాంటి ద్రవాలు ఉత్పత్తి కావని,ఉఛ్చాశ నిశ్వాసలు కూడా ఆగిపోతాయి కాబట్టి వైరస్ సోకే అవకాశం ఉండదని చెబుతున్నారు. కరోనా పాజిటివ్గా తేలినవారి మృతదేహాలకు పోస్టుమార్టమ్ కూడా చేయట్లేదు కాబట్టి... వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదంటున్నారు. మృతదేహం నుంచి బయటకొచ్చే ద్రవాలను తాకినప్పుడు మాత్రమే వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్ సంస్థ స్పష్టం చేసింది.
ఇవీ జాగ్రత్తలు...
మృతదేహాన్ని భద్రపరిచే సమయంలోనే నోరు,ముక్కు,చెవుల నుంచి ఎలాంటి ద్రవాలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం... జిప్ కలిగిన బ్యాగును ప్రత్యేకంగా శానిటైజ్ చేసి మృతదేహాన్ని అందులో భద్రపరిచి తరలిస్తారు. అంత్యక్రియలు నిర్వహించే చోట కూడా పూర్తి శానిటైజేషన్ చేస్తారు. మృతదేహాన్ని పూడ్చే గుంత ఆరడుగులకు తక్కువ కాకుండా జాగ్రత్త తీసుకుంటారు. హైపో క్లోరైడ్ సోడియం ద్రావణంతో చుట్టూ శుద్ది చేస్తారు. ఒకవేళ అంత్యక్రియల్లో జాప్యం జరిగితే మృతదేహాన్ని 4డిగ్రీల సెల్సియస్లో భద్రపరుస్తారు.
Recommended Video
అపోహలు వద్దంటున్న వైద్యులు...
కరోనా పేషెంట్ మృతదేహం నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి.. అపోహలతో అంత్యక్రియలను అడ్డుకోవడం సరికాదని వైద్యులు అంటున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కరోనాతో చనిపోతే తగు జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియల్లో పాల్గొనాలని చెబుతున్నారు. పోస్టుమార్టమ్ చేయని మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందదన్న విషయాన్ని గ్రహించాలంటున్నారు. మృతదేహాల్లో శ్వాస ప్రక్రియ నిలిచిపోతుంది కాబట్టి వైరస్ వ్యాప్తికి అవకాశం తక్కువని... కాబట్టి ప్రజలు అనవసర భయాందోళనను వీడాలని సూచిస్తున్నారు.