అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలా? - కోర్టులు..టౌన్ ప్లానింగ్ ఆఫీసులా: సుప్రీం సూటి ప్రశ్నలు
అమరావతి/న్యూఢిల్లీ: రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. వాటిపై వాదోపవాదాలను ఆలకించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని అభిప్రాయపడింది ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని వ్యాఖ్యానించింది.
ఆరు నెలల్లో అభివృద్ధి చేయడంపై..
జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సమక్షానికి వచ్చింది ఈ పిటీషన్. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. ఆరు నెలల్లోగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం..
దీనికి ప్రతిగా అమరావతి రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటీషన్లను దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు అయ్యేలా ఆదేశాలను జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆయా పిటీషన్లన్నింటినీ క్రోడీకరించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వాదోవాదాలను ఆలకించింది. ఈ సందర్భంగా పలు అంశాలు విచారణకు వచ్చాయి. అభివృద్ధి ఎలా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని తెలిపింది.
మధ్యంతర స్టే..
ఆరు నెలల్లోగా రాజధానిని అభివృద్ధి చేయడం సాధ్యమేనా? అని వ్యాఖ్యానించింది. అనంతరం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం. మధ్యంతర స్టే ఇవ్వడాన్ని పిటీషనర్ల తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ వ్యతిరేకించారు. ఈ పిటీషన్లపై వాదనలను వచ్చే వారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను ధర్మాసనం స్వీకరించలేదు. జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టులు.. టౌన్ ప్లానింగ్ ఆఫీసులా..
విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లోగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందని వ్యాఖ్యానించారు. కోర్టులు టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లా వ్యవహరించలేవని తేల్చి చెప్పారు.
ఆర్టికల్ ఏ 258
కార్యనిర్వాహక అధికారం అనేది ఏ 258 కింద శాసన వ్యవస్థకు సంబంధించిన అంశమని జస్టిస్ జే జోసెఫ్ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏ162 ప్రకారం.. శాసన అధికారాల ఆధారంగా కార్యనిర్వాహక అధికారం వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. శాసన వ్యవస్థకు- కార్యనిర్వాహక అధికారాలు ఉండబోవని ఈ ఆర్టికల్ చెప్పట్లేదని న్యాయవాది కేకే వేణుగోపాల్ చేసిన వాదనతో ఆయన ఏకీభవించారు. వికేంద్రీకరణకు అవసరమని పేర్కొన్నారు.
అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలా?
ఆ సమయంలో సీనియర్ అడ్వొకేట్ ఫాలి ఎస్ నారిమన్ జోక్యం చేసుకున్నారు. పార్లమెంటరీ చట్టం ఫలానా ప్రాంతాన్ని ఒక రాజధాని అని చెబితే అది రాజధాని అవుతుందని వివరించారు. దీనిపై జస్టిస్ జోసెఫ్ సూటిగా ప్రశ్నలు సంధించారు. రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పలేదు కదా అని ప్రశ్నించారు. దీనిపై నారిమర్ బదులిస్తూ- పార్లమెంటరీ చట్టంలోని సెక్షన్ 5లో ఈ అంశం ఉందని వివరించారు. ఏపీకి రాజధానిని నిర్ణయించే ప్రత్యామ్నాయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు.
ఫలానా ప్రాంతంలోనే..
ఒక నిర్దుష్ట ప్రాంతంలో రాజధాని ఉంటుందని ఎక్కడా చెప్పలేదని వివరించారు. రాజధాని ఎక్కడ ఉండాలో రాష్ట్రం నిర్ణయించుకోగలదని అన్నారు. ఏపీ ప్రభుత్వం తన పరిపాలన సౌలభ్యం కోసం సచివాలయం లేదా అందులో కొంత భాగాన్ని మరొక ప్రదేశానికి తరలించాలని అనుకుంటోందని అన్నారు. దీనికి నారిమర్ మాట్లాడుతూ పార్లమెంటరీ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి చెంది ఎగ్జిక్యూటివ్ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.