ఏపీ నడిబొడ్డున వైసీపీకి అగ్నిపరీక్ష...!విజయవాటికలో ఆమె గెలుపు అడ్డుకోగలరా?
ఏపీ వ్యాప్తంగా స్ధానిక పోరును ఏకపక్షంగా మార్చేస్తున్న అధికార వైసీపీ విజయవాడకు వచ్చేసరికి మాత్రం తడబడుతోంది. అమరావతి ఉద్యమం తెచ్చిన పరిస్ధితులో, గతంలో ఎదురైన చేదు అనుభవాలో, రాష్ట్రంలో తమ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారన్న కోపం స్ధానికంగా ఉండటమో తెలియదు కానీ వైసీపీకి ఇక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలువురు మంత్రులను సైతం మోహరించేందుకు వైసీపీ సిద్దమవుతోంది.
విజయవాడలో వైసీపీ..
2019 ఎన్నికల్లో ఏపీని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసిన వైసీపీ.. విజయవాడలో మాత్రం సత్తా చాటలేకపోయింది. విజయవాడ ఎంపీ స్ధానంతో పాటు తూర్పు నియోజకవర్గంలోనూ వైసీపీకి ఓటమి తప్పలేదు. అప్పట్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన పారిశ్రామికవేత్త పొట్లూరి వీర ప్రసాద్ వీర ప్రయత్నాలు చేసినా ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న టీడీపీ అభ్యర్ది కేశినేని నాని మరోసారి గట్టెక్కేశారు. అదే సమయంలో నగరంలో తూర్పు స్ధానాన్ని సైతం సమర్ధుడు, పేదల పక్షపాతిగా పేరుతెచ్చుకున్న గద్దె రామ్మోహన్ రూపంలో టీడీపీ దక్కించుకోగలిగింది. అసెంబ్లీ పోరులో వైసీపీని విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలకు పరిమితం చేయగలిగిన టీడీపీ మరోసారి అదే ఫీట్ రిపీట్ చేసేందుకు వ్యూహరచన చేస్తోంది.
ప్రతిష్టాత్మక పోరులో ఎంపీ కూతురు శ్వేత
ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖ తరలించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వచ్చిన విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలు టీడీపీకి కొత్త ఊపిరినిచ్చాయి. అమరావతి ఉద్యమ ప్రభావం విజయవాడపై ఉండటం, తన కూతురు శ్వేతను ఎన్నికల బరిలోకి దింపేందుకు ఇంతకన్నా మంచి తరుణం రాదని గ్రహించిన ఎంపీ కేశినేని విషయాన్ని చంద్రబాబు చెవిలో వేశారు. దీంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. స్ధానికంగా ఎంపీగా ఉండటంతో పాటు అమరావతి ఉద్యమ ప్రభావం, వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వంటి అంశాల నేపథ్యంలో తన కుమార్తె శ్వేతను కేశినేని 11వ డివిజన్ నుంచి రంగంలోకి దింపారు. అంతే కాదు టీడీపీ తరపున మేయర్ అభ్యర్దిగా కూడా అవకాశం ఇప్పించుకోగలిగారు.
శ్వేత రాకతో వైసీపీకి ముచ్చెమటలు.
నిన్న మొన్నటి వరకూ అమరావతి ఉద్యమ ప్రభావం రాజధాని గ్రామాలకే పరిమితం అవుతుందని, అక్కడ ఎన్నికలు వాయిదా వేస్తే సరిపోతుందని భావించిన వైసీపీ.. బెజవాడ కార్పోరేషన్ ఎన్నికల పరిణామాలతో ఇరుకునపడింది. ఏకంగా ఎంపీ కేశినేని కూతురే మేయర్ అభ్యర్ధిగా బరిలోకి దిగడంతో ఆమె గెలుపును అడ్డుకునేందుకు ఇప్పుడు సర్వశక్తులూ ఒడ్డేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఉన్నత విద్యావంతురాలు కావడం, గతంలో తండ్రి కేశినేని తరఫున పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి సైతం తిరిగిన అనుభవం, స్దానికంగా ఉన్న పరిచయాలు, ఎంపీ కుమార్తెగా ఆదరణ వంటి అంశాలు శ్వేతకు పాజిటివ్ గా ఉన్నాయి. అదే సమయంలో అమరావతి ఉద్యమం సైతం ఆమెకు మైలేజ్ గా మారబోతోంది. అందుకే ముందుగా 11వ డివిజన్ లో ఆమెను ఓడిస్తే చాలు మేయర్ సీటు ఎలాగో దక్కదని గ్రహించి అక్కడి నుంచే తమ పోరు ప్రారంభించేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది. త్వరలో విజయవాడ 11వ డివిజన్ లో ప్రచారానికి వైసీపీ మంత్రులు వచ్చినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది.
Recommended Video
శ్వేత గెలిస్తే మంత్రి పదవులు ఊడతాయా ?
ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత కార్పోరేటర్ గా గెలిచి, మేయర్ స్ధానం అధిష్టించే పరిస్ధితే వస్తే ఇక్కడ స్ధానిక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కన్నబాబు పదవులకు సైతం ఎసరు తప్పదు. దీంతో వీరిద్దరూ ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు. శ్వేతను అడ్డుకునేందుకు స్ధానికంగా ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలని భావిస్తున్న ఇద్దరు మంత్రులు త్వరలో 11వ డివిజన్ లో పర్యటించేందుకు సిద్దమవుతున్నారు. స్ధానిక పోరులో వైసీపీ అభ్యర్దులు ఓడిపోతే అందుకు బాధ్యత వహించి తమ పదవులు వదులుకోక తప్పదని సీఎం జగన్ ఇప్పటికే మంత్రులకు టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ ఎన్నికలు ఇద్దరు మంత్రులతో పాటు స్ధానిక వైసీపీ నేతలు, ఇన్ ఛార్జ్ లకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.