బలభద్రపురంలో కేన్సర్ కలకలం.. ఏడాదిలోనే 200 మంది..అసలేం జరుగుతోంది..?
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో కేన్సర్ కలకలం సృష్టిస్తోంది. ఏడాది కాలంలోనే ఏకంగా 200 మందికి పైగా ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకోగా.. 30 ప్రాణాలు విడిచారు. పచ్చని పొలాలతో ఏడాదిలో మూడు పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్న గ్రామస్తులు అనూహ్యంగా కేన్సర్ బారిన పడడం ఏంటని ఆందోళన వ్యక్తం అవుతోంది. సుమారు 16,000 మంది ప్రజలు నివసించే ఈ గ్రామంలో కేన్సర్ విజృంభించడానికి కారణాలు ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే విజ్ఞప్తితో వెలుగులోకి..
బీజేపీ నేత, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి.. గత శుక్రవారం శాసనసభలో ఈ అంశం ప్రస్తావించడంతో వెలుగులోకి వచ్చింది. బలభద్రపురంలో కేన్సర్ వ్యాధి విజృంభిస్తుందని.. పరీక్షలు నిర్వహించి, బాధితులకు చికిత్స అందజేయాలని కోరారు. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతుంటే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం తక్కువ లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది.

ఈ క్రమంలోనే బలభద్రపురంపై ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షలకై 31 వైద్య బృందాలను నియమించారు మంత్రి సత్యకుమార్. వారికి ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, కాకినాడ వైద్య కళాశాల, జీఎస్ఎల్ వైద్య కళాశాల నిపుణులు తగిన సహాయం అందిస్తారని స్పష్టం చేశారు. ప్రసుతం క్యాన్సర్ ఆందోళనకర స్థాయిలో లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. పింక్ రిబ్బన్ కార్యక్రమం ద్వారా క్యాన్సర్ పై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.
వైద్య పరీక్షలు..
ప్రభుత్వం ఆదేశాలతో వైద్య బృందాలు గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. 93 మంది సిబ్బంది 31 బృందాలుగా విడిపోయి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరించారు. కేన్సర్ అనుమానితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 38 మందికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 29 మందికి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. 9 మందికి ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తించారు. వీరిలో ఎముకల సమస్యలతో ఇద్దరు.. గైనిక సమస్యలతో ఇద్దరు.. లివర్, కిడ్నీ సమస్యలు, తీవ్రమైన రక్తహీనతలతో ఒక్కొక్కరు బాధపడుతున్నట్లు తేలింది.

ఈ మేరకు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు లేవని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అక్కడి జనాలకు సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేల్చింది. రోగులకు సంబంధిత వైద్యులు మందులు పంపిణీ చేస్తున్నట్టు వివరించింది. మూడు నెలల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచించారు. అయితే రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలతో ఉన్న మహిళకు సంబంధించిన వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనుమానితులైన ఏడుగురి నుంచి సేకరించిన నమూనాలపై రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్టు వైద్యులు చెప్పారు.
కేన్సర్ వ్యాప్తికి కారణం..
మరోవైపు ప్రాథమిక పరిశోధనలు భూగర్భజల కాలుష్యం, వాయు కాలుష్యం కారణం గానే క్యాన్సర్ కేసుల పెరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బలభద్రపురం దగ్గరలో ఉన్న గ్రాసిమ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్య కారకాలు నీటి నాణ్య, గాలి స్వచ్ఛతను ప్రభావితం చేస్తున్నాయనే ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలోని 25 ప్రదేశాల నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపినట్టు అధికారులు చెబుతున్నారు. రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.
అయితే బలభద్రపురంలో పర్యావరణ కాలుష్యం కారణంగా క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగాయని.. ఈ సమస్యపై సమగ్ర విచారణ జరిపించాలని 'ప్రజల కోసం శాస్త్రవేత్తల బృందం' ప్రతినిధులు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్యకు లేఖ రాశారు. గ్రామంలో క్యాన్సర్ తీవ్రతను గుర్తించేందుకు నిపుణుల బృందాన్ని పంపాలని.. పరిశీలన నిష్పాక్షికంగా, శాస్త్రీయంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో నమోదయ్యే సాధారణ కేసుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా గ్రామంలో కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కలెక్టర్లు ప్రకటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని వాపోయారు.












Click it and Unblock the Notifications