27న కేబినెట్ భేటీ: అమరావతి రైతులపై జగన్ మార్క్..టీడీపీ యూటర్న్ తీసుకునేలా?
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అమరావతి ప్రాంత రైతులు తీవ్ర వ్యతిరేకత, నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న వేళ.. రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశం కానుంది. అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో మంత్రివర్గం సమావేశం కానుండటం కీలకంగా మారింది. అందరి దృష్టీ ఆ సమావేశం మీదే నిలిచింది.
పోలీసుల చర్యకు..
అమరావతి రైతుల్లో వ్యక్తమౌతోన్న నిరసన జ్వాలలను చల్లర్చడానికి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు? ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమౌతోంది. రైతులపై పోలీసులను ప్రయోగించి, వారి నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలను భగ్నం చేసే సాహసం వైఎస్ జగన్ చేయబోరని అంటున్నారు. తనదైన శైలిలో వారిని నచ్చజెప్పవచ్చని తెలుస్తోంది. దీనికోసం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదని సమాచారం.
రాజధాని తప్ప..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ వైఎస్ జగన్ నిండు సభలో ప్రకటించినప్పటి నుంచీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు భగ్గుమని మండుతూనే ఉన్నారు. తమ నిరసనలను ప్రదర్శిస్తున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు. బుధవారం నాటికి వారి నిరసన ప్రదర్శనలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. వందలాది మంది రైతులు ఒక్కసారిగా రోడ్ల మీదికి రావడం, ధర్నాలు, బైఠాయింపులకు దిగడంతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఊరట ఎలా..?
అమరావతిని యథాతధంగా కొనసాగించడాన్ని మినహా మరే అంశాన్ని రాజధాని ప్రాంత రైతులు ప్రస్తావించట్లేదు. ఏ డిమాండ్ ను కూడా లేవనెత్తట్లేదు. తమకు ప్రత్యామ్నాయాన్ని కల్పించాలని కూడా కోరట్లేదు. అమరావతి రైతులందర్నీ శాంతింపజేసే నిర్ణయాలను శుక్రవారం ఏర్పాటు కాబోయే మంత్రివర్గ సమావేశంలో తీసుకోవచ్చని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని భూసమీకరణ సందర్భంగా భూములిచ్చిన రైతులకు ప్రకటించిన ప్యాకేజీలో మార్పులు చేయవచ్చని సమాచారం.
ప్యాకేజీ భారీగా పెంపు
భూమిలిచ్చిన రైతుల పరిహారాలను భారీగా పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న పరిహారం ఎంత? ఏ స్థాయిలో పెంచితే.. రైతులు దాన్ని ఆమోదిస్తారు? తమ ఆందోళనలను విరమిస్తారు? అనే దిశగా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా- వ్యవసాయం, మున్సిపల్ మంత్రిత్వ శాఖల నుంచి దీనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు, వివరాలను ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం.
టీడీపీకి చెక్ పెట్టేలా..
రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆగ్రహ జ్వాలను చల్లార్చేలా మంత్రివర్గం తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా, అది తెలుగుదేశం పార్టీని సైతం చెక్ పెట్టేలా ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు తెలుగుదేశం సారథ్యాన్ని వహిస్తోంది. అమరావతి రైతులకు ప్రకటించే వరాలు.. టీడీపీని ఒంటరిగా చేసేలా ఉంటాయని, రైతులు ఎవరూ ఆ పార్టీ వెంట లేకుండా చేసేలా ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు.