రాజధానిలో రోడ్లే కాదు, మట్టి మాయం చేస్తున్న దొంగలు ; తుళ్ళూరు పోలీస్ స్టేషన్ ముందు రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అమరావతి విషయంలో నీలినీడలు అలుముకున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండి రాజధాని అమరావతి అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం తో అమరావతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక ఆ తర్వాత సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటన చేయడంతో అమరావతి వేదికగా రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అని ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాదాపుగా రెండు సంవత్సరాలుగా రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అని ఆందోళనలు కొనసాగుతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.

రాజధానిలో కంకర దొంగలు.. రోడ్లు తవ్వేస్తూ నాశనం
ఇప్పటికే సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటన తో, విపరీతంగా రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయి. పరిస్థితి దారుణం గా తయారైంది. అమరావతి నగరం అభివృద్ధి శూన్యం గా కళావిహీనంగా పేరేంది. ఇదిలా ఉంటే రాజధాని అమరావతి లో ఇటీవల కాలంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాల కోసం నిల్వచేసిన కంకర, ఇసుక చేయడంతో పాటుగా, ఏకంగా రోడ్లనే తవ్వేస్తూ కంకర మాయం చేస్తున్నారని ఇప్పటికి రెండుసార్లు రాజధాని అమరావతి గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిలో కంకర దొంగలు రెచ్చిపోతున్నారు అని వైసిపి నాయకులు అండదండలతోనే రాజధాని నగరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న ఉద్యమ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది.

వరుస ఘటనలతో రైతుల ఆగ్రహం
మొన్నటికి మొన్న ఉద్దండరాయునిపాలెంలో రోడ్లను తవ్వేసి కంకర ,ఇసుకను తరలించుకు వెళ్లారు దుండగులు. ఇక ఈ సంఘటన మర్చిపోకముందే మరోమారు మోదుగు లింగాయపాలెంలో రోడ్డును తవ్వి కంకర మాయం చేశారు. మోదుగ లింగాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ఉన్న రోడ్డును తవ్వి గుర్తుతెలియని దుండగులు కంకరను తరలించారు. నాలుగు అడుగుల లోతు, రెండు వందల మీటర్ల పొడవున రోడ్డును తవ్వేసిన దుండగులు కంకర మాయం చేశారు. దాదాపు 100 టిప్పర్ల కంకరను తరలించి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా రాజధాని అమరావతిలో రోడ్లను తవ్వుతూ, రాజధానిలో విధ్వంసం చేస్తున్న ఘటనపై అమరావతి దళిత జేఏసీ నాయకులు, వెలగపూడి రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మట్టిని కూడా వదలకుండా అక్రమ తవ్వకాలు .. ఆందోళనకు దిగిన రైతులు
ఇదిలా ఉంటే తాజాగా కృష్ణాయ పాలెం వెంకటాయపాలెం మధ్య నల్లమట్టిని అక్రమార్కులు తవ్వకం చేసుకుపోతున్నారని, ఎన్ని ఫిర్యాదులు చేసినా దోపిడీలు ఆగడం లేదని రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయానికి వెళ్లే దారిలోనే అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. పోలీసులు చోద్యం చూస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే రాజధానిలో అక్రమ తవ్వకాల పై చర్యలు తీసుకోవాలంటూ ఈరోజు తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.

తుళ్ళూరు పోలీస్ స్టేషన్ ముందు రైతుల ఆందోళన
ఇక రాజధానిలో రోడ్ల తవ్వకాలపై వైసీపీ నాయకులకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన రైతులు ఆందోళన చేపట్టారు. అంతేకాదు తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కారణంగా రైతులు తీవ్ర ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. అయితే ఆ ఆడియో తనది కాదని, విచారణకు ఆదేశించామని, ఇప్పటికే అక్రమ తవ్వకాలు దారులపై కేసులు కూడా నమోదు చేశామని తుళ్లూరు సిఐ రైతులకు వివరించారు. రాజధానిలో ఆస్తులకు రక్షణ లేదని, పోలీసుల పై తమకు నమ్మకం లేదని రైతులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications