ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని గోకుతున్నారు: అమరావతి రాజధానికి..కమలానందభారతి మద్దతు
రాజధానికి శంకుస్థాపన జరిగినరోజే అమరావతి ప్రాంతంలో అమరాంబికా పరమేశ్వరి అమ్మవారు వెలిసినట్లుగా భావించాలని, రాజధాని నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి అన్నారు. రాజధాని ప్రాంతంలో నిరసనలు చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించిన ఆయన ప్రస్తుత ప్రభుత్వంపై పరోక్షంగా పలు కామెంట్లు చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని కావాలని గోకుతున్నారని, ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నదని మండిపడ్డారు.
రాజకీయ భవిష్యత్తు ఉండదు..
2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొంతమందికి రాజకీయ భవిష్యత్తు లేకుండాపోయిందని, ఇప్పుడు అమరావతి జోలికి వస్తున్నవాళ్లకు కూడా రాబోయేరోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదని కమలానంద హెచ్చరించారు. ఒకరు కోరితే అమరావతి సంకల్పం జరగలదేలని, ఒకరు వద్దనుకున్నంతమాత్రాన అది ఆగిపోదని, దైవ నిర్ణయం కాబట్టే రాజధాని నిర్మాణం జరిగితీరుతుందని చెప్పారు. సెంటిమెంట్లతో ఆడుకోకుండా, వాటిని పాటిస్తే అందరికీ మంచి జరుగుతుందన్నారు.
ఉద్యమాన్ని విస్తరించండి..
రాజధాని అమరావతిలోనే ఉండాలన్న ఉద్యమం ప్రస్తుతానికి 29 గ్రామాల్లోనే జరుగుతున్నదని, దీన్ని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తేనే ప్రజాబలం పెరుగుతుందని నిరసనకారులకు కమలానందభారతి సూచించారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో అమ్మవార్లకు పూజలు జరపాలని కోరారు. వచ్చే పదేండ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని భరోసా ఇచ్చారు.
పలు చోట్ల నిరసలు
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ భూములిచ్చిన రైతులు భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు. సీఎం జగన్ తన ఇష్టానికి రాజధానుల్ని పెడతానంటూ ప్రజలు సహించబోరని ప్రతిపక్ష టీడీపీ నేతలు హెచ్చరించారు. రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.